నేను రిలాక్స్ కాను...మిమ్మల్ని రిలాక్స్ కానివ్వను: మంత్రి హరీష్ రావు
ABN , First Publish Date - 2022-04-07T23:36:16+05:30 IST
" నేను రిలాక్స్ కాను...మిమ్మల్ని రిలాక్స్ కానివ్వను" అని వైద్యాధికారులతో
హైదరాబాద్: " నేను రిలాక్స్ కాను...మిమ్మల్ని రిలాక్స్ కానివ్వను" అని వైద్యాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్యాధికారులతో ఆయన మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కరోనా ముందు అగ్ర దేశాలు కూడా మోకరిల్లాయన్నారు. వైద్య శాఖకు 6295 కోట్ల నుంచి 11 వేల కోట్లకు పైగా బడ్జెట్ను పెంచామన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పెంచుకున్నామని ఆయన తెలిపారు టిమ్స్ ఆసుపత్రిని 2 వేల పడకలు, నిమ్స్ను 2 వేల పడకల స్థాయి ఆస్పత్రికి పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. నగరానికి నలువైపులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. దీంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మెడికల్ సీట్లు పెరుగుతాయన్నారు. క్రిటికల్గా ఉన్న పేషంట్లను కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేర్చుకోరని, కానీ కొన ఊపిరి మీద ఉన్న వారిని కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకుంటామని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగాల్సింది చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి PHCలో డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. సూపరింటెండెంట్లకు పూర్తి అధికారాలు ఇచ్చామన్నారు.
డాక్టర్లు మేల్కొనాల్సిందే..
డాక్టర్లు మేల్కొనాల్సిందేనని ఆయన హెచ్చరించారు. డాక్టర్స్లో బాగా పని చేసేవాళ్లను ప్రేమిస్తామని, గౌరవిస్తామని ఆయన అన్నారు. డాక్టర్లు ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
గైనకాలజిస్ట్లకు మంత్రి హరీష్ వార్నింగ్
రాష్ట్రంలోని ఆసుపత్రులలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాల్సిందేనని గైనకాలజిస్ట్లకు మంత్రి హరీష్ వార్నింగ్ ఇచ్చారు. ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్ల తీరు మారాలన్నారు. మెడికల్ కౌన్సిల్ ద్వారా సిజేరియన్ చేసే గైనకాలజిస్ట్ల అనుమతిని రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో మొదటి స్థానాల్లో ఉన్నామని నేను రిలాక్స్ కాను... మిమ్మల్ని రిలాక్స్ కానివ్వనని ఆయన అన్నారు. వైట్ కోట్ విలువను సమాజంలో పెంచాలని వైద్యాధికారులకు హరీష్ రావు సూచించారు.