నేను ‘హెడ్ మాస్టర్’ను కాదు : శరద్ పవార్

ABN , First Publish Date - 2020-07-11T23:02:14+05:30 IST

మహా వికాస్ అగాఢీలో తానేమీ ‘హెడ్ మాస్టర్’ను కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు.

నేను ‘హెడ్ మాస్టర్’ను కాదు : శరద్ పవార్

ముంబై : మహా వికాస్ అగాఢీలో తానేమీ ‘హెడ్ మాస్టర్’ను కాదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. తాను రిమోట్ కంట్రోల్ అంటూ వస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టి పారేశారు. ‘‘నేను హెడ్ మాస్టర్ని కాదు. అవన్నీ పాఠశాలల స్థాయిలో ఉంటాయి. ప్రజాస్వామ్యంలో అయినా, ప్రభుత్వాన్ని నడిపే విషయంలోనైనా ‘రిమోట్ కంట్రోల్’ పనిచేయదు. ప్రజాస్వామ్యం లేని ప్రదేశాల్లో మాత్రం ఈ రిమోట్ కంట్రోల్ పనిచేస్తుంది’’ అని పవార్ స్పష్టం చేశారు.


శివసేన అధికారిక పత్రిక సామ్నా శరద్ పవార్‌ను ఇంటర్వ్యూ చేసింది. కరోనా సమయంలో ఉద్ధవ్ అత్యంత జాగరూకతతో వ్యవహరించి, అలాగే లాక్‌డౌన్ అమలు చేసి, జాగ్రత్తగా వ్యవహరించారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను సడలించే విషయంలో తనకూ, ప్రభుత్వానికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు.


ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి పద్ధతి ప్రకారం నిబంధనలను సడలించామని, ఈ విషయంపై చాలా మందితో చర్చించామని, ముఖ్యమంత్రి ఉద్ధవ్ దృష్టికి కూడా తీసుకెళ్లామని తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించే క్రమంలో శరద్ పవార్‌కు, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌కు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని శరద్ పవార్‌ను సామ్నా ఎడిటర్ రౌత్ ప్రశ్నించగా.... పవార్ సమాధానమిస్తూ...


‘‘అది శుద్ధ తప్పు. ఆ సమయంలో నేను సీఎంతోనే ఉన్నాను. ఈ రోజు కూడా ఆయన వెన్నంటే ఉన్నాను. ఆ సమయంలో కార్మిక సంస్థలు, వ్యాపార యజమానులు, తదితరులతో చర్చలు జరిపాను. వాటి ఆధారంగానే నేను ఓ అభిప్రాయానికి వచ్చాను. దానిని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. దీనిని భిన్నాభిప్రాయం అని అనరు. ఢిల్లీ, కర్నాటకలో నిబంధనలను సడలించారు. తర్వాత పరిణామాలను చవి చూశారు. అయినా సరే.. ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అలాంటి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలిందో... రాబోయే తరాలు కరోనా కంటే అధిక ప్రమాదాన్నే ఎదుర్కునే అవకాశం ఉంది.’’ అని శరద్ పవార్ తెలిపారు.


నిబంధనలను సడలించే విషయంలో సీఎం ఠాక్రే ఆలస్యం చేశారని అందరూ భావించారని, కానీ ఆయన సరైన సమయంలోనే సడలించారని శరద్ పవార్ ప్రశంసించారు. 


Updated Date - 2020-07-11T23:02:14+05:30 IST