Hyderabad Woman: ప్రతిసారి అదే మాట చెబుతున్నారు.. మేం ఇంటికి వెళ్లేది ఎప్పుడు!

ABN , First Publish Date - 2022-08-14T18:35:16+05:30 IST

భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న 46ఏళ్ల మహిళ.. ప్రస్తుతం ఒమన్‌లోని భారత ఎంబసీ(Indian Embassy) ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉన్నారు. గత నెల రోజులుగా అక్కడే ఉంటున్న ఆమె.. హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తోంది. తనను తనతోపాటు వసతి గృహంలో ఉన్న మహిళలను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు..

Hyderabad Woman: ప్రతిసారి అదే మాట చెబుతున్నారు.. మేం ఇంటికి వెళ్లేది ఎప్పుడు!

ఎన్నారై డెస్క్: భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న 46ఏళ్ల మహిళ.. ప్రస్తుతం ఒమన్‌లోని భారత ఎంబసీ(Indian Embassy) ఏర్పాటు చేసిన వసతి గృహంలో ఉన్నారు. గత నెల రోజులుగా అక్కడే ఉంటున్న ఆమె.. హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తోంది. తనను తనతోపాటు వసతి గృహంలో ఉన్న మహిళలను సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ అక్కడి ఎంబసీ అధికారులను అభ్యర్థించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో(Social Media) వైరల్‌గా మారింది. కాగా.. ఒమన్‌కు ఆమె ఎలా వెళ్లింది. ప్రస్తుతం వసతి గృహంలో ఎందుకు ఉంటోంది. ఆమె హైదరాబాద్ ప్రయాణం ఎందుకు ఆలస్యం అవుతుందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట(Hyderabad Woman) ప్రాంతానికి చెందిన 46ఏళ్ల అమీనా బేగం‌(Ameena Begum) కుటుంబ పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి అక్కడ పని చేయాలని అనుకుంది. అక్కడ సంపాదించే డబ్బుతో అనారోగ్యంతో ఉన్న భర్తకు వైద్యం, ముగ్గురు పిల్లల పెళ్లీళ్లు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఓ ట్రావెల్ ఏజెంట్‌ను సంప్రదించింది. ఏజెంట్ మాటలు నమ్మి.. విజిట్ వీసా(Visit Visa) పై ఒమన్(Oman) వెళ్లింది. అక్కడ పనిలో చేరిన తర్వాత విజిట్ వీసాను యజమాని వర్క్ వీసాగా మారుస్తాడని భావించింది. అయితే.. అది జరగకపోగా.. ఆమె పని చేస్తున్న ఇంట్లో తీవ్ర చిత్ర హింసలు ఎదుర్కొంది. పనిలో చేరిన సమయంలో పాస్‌ పోర్ట్‌ను.. యజమాని స్వాధీనం చేసుకోవడంతో ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది. దీంతో అధికారులు ఆమెను ఎంబసీ ఆధ్వర్యంలోని వసతి గృహానికి తరలించారు. 





ఈ క్రమంలో యజమాని ఆమెపై అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమెను పనిలోకి చేర్చుకునే సమయంలో ఏజెంట్‌కు కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అగ్రిమెంట్ ప్రకారం.. ఆమె తన ఇంట్లో పని చేయాల్సి ఉంటుందని లేని పక్షంలో ఏజెంట్‌కు ఇచ్చిన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే ఆమె హైదరాబాద్ ప్రయాణానికి అడ్డంకిగా మారింది. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నందున ఎంబసీ అధికారులు ఆమెను ఇండియాకు తరలించలేకపోతున్నారు. గత నెల రోజులుగా ఎంబసీ ఆధ్వర్యంలోని వసతి గృహంలో నివసిస్తున్న ఆమె.. తాజాగా ఓ వీడియోలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


వసతి గృహంలో తనతోపాటు సుమారు 85 మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ మహిళలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు కూడా ఉన్నారన్నారు. కొందరైతే 7-8 నెలలుగా అక్కడే ఉంటూ స్వదేశానికి తిరిగి వళ్లేందుకు నిరీక్షిస్తున్నారని వాపోయారు. తమ ప్రయాణం గురించి ఎప్పుడు అడిగినా.. వచ్చే వారం ఉంటుందంటూ అధికారులు సమాధానం ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తనను.. తనతోపాటు ఉంటున్న మహిళలను స్వస్థలాలకు పంపించేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని అధికారులను అభ్యర్థించారు. ఈ వీడియోను టీపీసీసీ గల్ఫ్ ఎన్నారై(TPCC Gulf NRI) సింగిరెడ్డి నరేష్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 


Updated Date - 2022-08-14T18:35:16+05:30 IST