హైదరాబాద్ : రెండు నెలలుగా ఇంట్లో ఉన్న బండికి చలానా..!

ABN , First Publish Date - 2020-05-21T16:20:17+05:30 IST

ఆ ద్విచక్ర వాహనం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి (దాదాపు రెండు నెలల నుంచి)

హైదరాబాద్ : రెండు నెలలుగా ఇంట్లో ఉన్న బండికి చలానా..!

  • వాహనం రెండు నెలలుగా బడంగ్‌పేట్‌లోనే..
  • గచ్చిబౌలిలో ట్రాఫిక్‌ చలానా

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : ఆ ద్విచక్ర వాహనం లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి (దాదాపు రెండు నెలల నుంచి) బాలాపూర్‌ మండలం బడంగ్‌పేట్‌లోని యజమాని ఇంట్లోనే ఉంది. దాంతో అది దుమ్ము కొట్టుకుపోయింది. అయితే ఇంట్లో ఉన్న ఆ వాహనానికి సైబరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులు ఈ - చలానా విధించారు. వెనక కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌ ధరించలేదన్నది వారు చూపిన కారణం! తాను అస్సలు బండి బయటకే తీయలేదని, గచ్చిబౌలి వైపు వెళ్లనే లేదని వాహనదారుడు చెబుతున్నారు. పైగా గచ్చిబౌలి పోలీసులు బాధితుడి ఇంటికి పంపించిన చాలానాకు సంబంధించిన లెటర్‌లో చూపించిన ఇమేజ్‌ (ఫొటో) ఏమాత్రం స్పష్టంగా లేదు. ఆ ఇమేజ్‌లో మూడు ద్విచక్ర వాహనాలు కనిపిస్తుండగా, పోలీసులు పేర్కొన్న వాహనం ఏదో స్పష్టంగా చూపించలేదు. 


ఎంత వరకు సమంజసం..

‘‘నేను రెండు నెలలుగా బయటకే వెళ్లలేదు. అయినా గచ్చిబౌలిలో తిరిగినట్టుగా నా వాహనానికి (టీఎస్‌08 ఈహెచ్‌6922) చలానా విధించడం ఎంత వరకు సమంజసం. మాకు రూ.135 పెద్ద మొత్తమేమీ కాదు. కాకపోతే పోలీసులు చేస్తున్న ఇటువంటి తప్పిదాల వల్ల ఎంతో మంది అమాయకులు మానసికంగా కుంగిపోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని సైబరాబాద్‌ సీపీ దృష్టికి తీసుకుపోయా. గచ్చిబౌలి ట్రాఫిక్‌ పీఎస్‌ నంబరుకు ఫోన్‌ చేశా. వాహనం నంబరును తప్పుగా నమోదు చేయడం వల్ల ఈ పొరపాటు జరిగినట్టుగా గచ్చిబౌలి పోలీసులు చెప్పారు. ఆన్‌లైన్‌లో చలానాను తొలగిస్తామన్నారు.’ అని వాహనదారుడు మోహన్‌రావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. 

Updated Date - 2020-05-21T16:20:17+05:30 IST