మరమరాల పందిరిలో సీతారాముల కల్యాణం
ABN , First Publish Date - 2022-04-09T18:00:43+05:30 IST
సైదాబాద్, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో 37 ఏళ్లుగా మరమరాల పందిరిలో సీతారాముల కల్యాణం కనుల పండువగా
హైదరాబాద్/సైదాబాద్: సైదాబాద్, ఏపీఏయూ కాలనీలోని ధర్మనిలయంలో 37 ఏళ్లుగా మరమరాల పందిరిలో సీతారాముల కల్యాణం కనుల పండువగా జరిపిస్తున్నారు. రామభక్తురాలైన ఆ ఇంటి యజమాని అనసూయమ్మ నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఉగాది రోజున ప్రారంభమై నవమి రోజు కల్యాణంతో ముగుస్తాయి. రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో జాగ్రత్తలతో నిర్వహించిన ఉత్సవాలు ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. రామాయణ ఇతిహాసం తెలియజేసే విధంగా ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీప గ్రామానికి చెందిన అనసూయమ్మ కుటుంబం కొన్నేళ్లుగా ఏపీఏయూ కాలనీలో స్థిరపడింది. ఇక్కడ జరిగే ఉత్సవాలకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో రామకోటి జపం, విష్ణుసహస్ర నామాలు, నగర సంకీర్తన, భజనలు, హోమాలు, నిత్యాన్నదానం చేస్తారు.
జపంతో...
మాఘశుద్ధ పంచమి రోజున గ్రామదేవతకు చలిమిడి, పాలతో అభిషేకించి పందిరి పనులకు శ్రీకారం చుడతారు. మరమరాల ముత్యాల పందిరి అలంకరణను ఉగాది రోజున ప్రారంభిస్తారు. సుమారు 40 మంది మహిళలు రోజూ దారాలకు మరమరాలు ఎక్కిస్తారు. 60 కిలోల మరమరాలు, 40 కిలోల వేరుశెనగలను అలంకరణకు వినియోగిస్తారు. రామనామ జపం చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ అల్లికలను సాగిస్తారు.
మరా...మరా... రామ.
రామ జపానికి మూలం మర అనే భావనతో సీతారాముల కల్యాణానికి మరమరాలను ఏర్పాటుచేశారు. పదకొండు మరమరాల చొప్పున తయారు చేసే దండలో ఓ పల్లీగింజ (వేరుశెనగ) చేరుస్తారు. సీతాదేవి భూగర్భంలో అవతరించిందనే పౌరాణిక గాథను అనుసరించి భూమి నుంచి వచ్చే వేరుశెనగకు మరమరాల దండల్లో ప్రాధాన్యం కల్పిస్తున్నారు. దశేంద్రియాల తర్వాత ఏకాదశ ఇంద్రియానికి ప్రత్యేక స్థానం కల్పించే ఉద్దేశంతోనే పదకొండు సంఖ్యను ఎన్నుకున్నామని అనసూయమ్మ పేర్కొన్నారు.
రామాయణంపై విశ్వాసంతో....
రామాయణంపై విశ్వాసంతో శ్రీరామ కల్యాణం జరిపిస్తున్నామని, ఇందుకు ఇద్దరు కుమారులు, కోడళ్లు సహకరిస్తున్నారు. యజ్ఞం నిరాటంకంగా కొనసాగిస్తున్నాం. తన తరువాత కుమారులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నా
- అనసూయమ్మ