HYD : కూరగాయల ట్రేల మధ్యలో గంజాయి.. గుట్టుగా రవాణా..!
ABN , First Publish Date - 2021-10-17T13:02:49+05:30 IST
మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా రంజన్బాగ్ ప్రాంతానికి చెందిన విలాస్ భావు సాహెబ్ థోఖనే (33)కు డీసీఎం వ్యాన్ ఉంది. సొంతంగా నడుపుతుంటారు...
హైదరాబాద్ సిటీ : ఖాళీ కూరగాయల ట్రేలలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్, మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల నుంచి మహారాష్ట్రకు గంజాయిని నగరం మీదుగా తీసుకెళ్తూ ఇక్కడ విక్రయిస్తుండగా, పట్టుకున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లా రంజన్బాగ్ ప్రాంతానికి చెందిన విలాస్ భావు సాహెబ్ థోఖనే (33)కు డీసీఎం వ్యాన్ ఉంది. సొంతంగా నడుపుతుంటారు. తనకు పరిచయం ఉన్న నర్సీపట్నంకు చెందిన వానపల్లి నాగసాయి ఆంధ్ర, ఒడిషా సరిహద్దు నుంచి గంజాయి తీసుకువచ్చి నక్కపల్లి వద్దకు చేర్చేవాడు. అతని వద్ద నుంచి విలాస్ భాపు గంజాయి కొనుగోలు చేసి, మహారాష్ట్ర అహ్మద్నగర్ ప్రాంతానికి చెందిన థ్యానేశ్వర్ మోహితే (26) సహకారంతో తన డీసీఎం వాహనంలో తరలించేవాడు. నగరం మీదుగా ప్రయాణిస్తూ నగరంలో కొంత సరుకు విక్రయించేవాడు. దందాలో భాగంగా విలాస్భావు, థ్యానేశ్వర్ మోహితేలు 300 కిలోల గంజాయిని అహ్మద్నగర్ తరలిస్తుండగా, పక్కా సమాచారమందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ సిబ్బంది.
మలక్పేట పోలీసులు మూసారంబాగ్ క్రాస్రోడ్స్ వద్ద ఆపి తనిఖీ చేయగా, కూరగాయల ట్రేల మధ్య 10 సంచుల్లో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడి నుంచి 300 కిలోల గంజాయి, డీసీఎం వాహనం, రెండు సెల్ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. వీరి నెట్వర్క్ మొత్తం సమాచారం తెలుసుకునేందుకు నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నామని, గంజాయి దందాలో సహకరించే వారిని అరెస్ట్ చేసేందుకు సహకరించాలని ఒడిషా డీజీపీకి లేఖ రాశామని తెలిపారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ పి రాధాకిషన్ రావు, ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ అభినందించారు.
కూరగాయలు తీసుకెళ్తున్నామని..
నిందితులు కూరగాయల ఖాళీ ట్రేలలో గంజాయి రవాణా చేస్తూ పోలీసులను బురడీ కొట్టించేవారు. నార్త్జోన్ టాస్క్ఫోర్స్, మలక్పేట పోలీసులు పట్టుకున్న నిందితులు ఇప్పటి వరకు ఇలా రెండు, మూడు సార్లు గంజాయి తరలించినట్లు అంగీకరించినట్లు తెలిసింది. గంజాయి తరలించే సమయంలో డీసీఎంలో కూరగాయల ఖాళీ ట్రేతో నింపేవారు. చెక్పోస్ట్ల వద్ద తనిఖీల సమయంలో సమీపంలో ఉన్న మార్కెట్లో కూరగాయలు తరలించి తిరిగి వెళుతున్నామని చెప్పేవారు. కూరగాయల రవాణా సాధారణ విషయం కావడంతో చెక్పోస్టుల వద్ద కూడా ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ఖాళీ ట్రేల మద్యలో గంజాయి ఉంచి రవాణా చేసేవారు.
కఠిన చర్యలు : సీపీ
గంజా ముక్త్ తెలంగాణలో భాగంగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని గంజాయి విక్రేతలపై, కఠిన చర్య లు తీసుకుంటామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. నెల రోజుల్లో గంజాయి విక్రేతలపై 78 కేసులు నమోదు చేశామని, 121 మందిని అరెస్ట్ చేసి, 1480 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.