ఢిల్లీలో రెండు కాల్సెంటర్లపై హైదరాబాద్ పోలీసుల దాడులు
ABN , First Publish Date - 2021-04-11T17:58:19+05:30 IST
ఢిల్లీలోని రెండు కాల్ సెంటర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులు దాడులు
- ఉద్యోగాలపేరుతో మోసాలకు పాల్పడుతున్న..
- ఆరుగురు సైబర్ నేరగాళ్ల అరెస్టు
హైదరాబాద్ : ఢిల్లీలోని రెండు కాల్ సెంటర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్, సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి దేశవ్యాప్తంగా అమాయకులను అడ్డంగా దోచేస్తున్న ఆరుగురు సైబర్ నేరగాళ్లను శనివారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్హౌజ్ ప్రాంతానికి చెందిన యువకుడు తన రెజ్యూమ్ను ఆన్లైన్ జాబ్పోర్టల్ నౌకరీ డాట్ కామ్లో గతేడాది ఆగస్టులో అప్లోడ్ చేశారు. మరుసటి రోజే శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. మీ రెజ్యూమ్ పరిశీలించాము. టాటా కంపెనీలో మీకు సరిపడే ఉద్యోగం ఉందన్నారు. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.2,600లు చెల్లించాలన్నారు.
అలా వివిధ రకాల ఫీజుల పేరుతో.. విడతలవారీగా రూ.78వేలు లాగేశారు. ఎంతకీ జాబ్ ఇవ్వకపోవడం, ఇంకా డబ్బులు కావాలని అడగడంతో అనుమానం వచ్చి నిలదీశాడు. దాంతో వారు ఫోన్లు స్విచాఫ్ చేశారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహా కేసులు మరికొన్ని రిపోర్టు కావడంతో సీపీ అంజనీకుమార్ సైబర్ క్రైమ్, సీసీఎస్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన బృందం గజియాబాద్ ప్రాంతంలో రెండు కాల్సెంటర్లపై దాడులు నిర్వహించింది. మొత్తం ఆరుగురు సైబర్నేరగాళ్లు రవికుమార్, అమర్కుమార్ సింగ్, శివం త్రిపాఠి, ప్రకాశ్, విజయ్కుమార్, ప్రియాంకలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రవికుమార్కు కొన్ని కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండడంతో తన అనుచరులతో స్వయంగా కాల్సెంటర్లను ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.