రెండో రోజు ప్రారంభమైన BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు.. Telanganaపై ప్రత్యేక చర్చ..
ABN , First Publish Date - 2022-07-03T18:00:48+05:30 IST
రెండో రోజు ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ వేదికగా ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్ (Hyderabad): రెండో రోజు ఆదివారం బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్ఐసీసీ (HICC) వేదికగా ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ (Telangana)పై ప్రత్యేక చర్చ జరుగుతున్నట్లు సమాచారం. భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో కీలక రాజకీయ తీర్మానాన్ని బీజేపీ ఆమోదించనుంది. మొదటి రోజు (శనివారం) సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ (Modi) రాత్రి నోవాటెల్ (Novotel) హోటల్లో బస చేశారు. తెలంగాణలో పాగావేయాలనే ప్రయత్నాలు.. దక్షిణాదిన విస్తరించాలనే వ్యూహంలో భాగంగా జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది.
ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు, 350 మంది ప్రతినిధులు హైదరాబాద్కు తరలివచ్చారు. నిన్న శనివారం తొలిరోజు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ రోజు కార్యవర్గ సమావేశంలో మోదీ, అమిత్ షాలు ప్రసంగించనున్నారు. పార్టీ బలోపేతానికి ఉద్దేశించిన అంశాలను ఈ సమావేశంలో చర్చిస్తామని హైదరాబాద్ వచ్చిన వెంటనే ప్రధాని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కార్యవర్గం సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది. లక్షలాది మంది పాల్గొనే ఈ భారీ బహిరంగసభలో ప్రదాని మోదీ పాల్గొని కీలక ఉపన్యాసం చేయనున్నారు.