లక్ష్మణ రేఖ గీసుకోండి.. ఇల్లు దాటి రాకండి : సీపీ

ABN , First Publish Date - 2020-04-03T12:41:08+05:30 IST

రామాయణంలో లక్ష్మణ రేఖకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు

లక్ష్మణ రేఖ గీసుకోండి.. ఇల్లు దాటి రాకండి : సీపీ

హైదరాబాద్‌ : రామాయణంలో లక్ష్మణ రేఖకు ఎంతో ప్రాముఖ్యం ఉందని, కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరూ లక్ష్మణ రేఖ గీసుకొని నియంత్రణ పాటించాలని సీపీ అంజనీకుమార్‌ కోరారు. గురువారం శ్రీరామనవమి సందర్భంగా నగరవాసులకు హైదరాబాద్‌ పోలీసుల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భారీ పందిళ్లు, వేదికల్లో నిర్వహించే నవమి పండగను ఇళ్లలోనే జరుపుకున్నందుకు ప్రజలను ఆయన అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్లమీదికి రాకపోవడం, భౌతిక దూరం పాటించడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. 


కరోనాపై జరుగుతున్న పోరులో ప్రభుత్వం, అన్ని శాఖలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ఆయన చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. పోలీసులు 24 గంటలూ విధుల్లో ఉంటున్నారని, వారి సేవలకు గుర్తింపుగా వారిని అభినందించేందుకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ నియమాలు పాటించి ఇళ్లలో ఉండాలన్నారు. నిత్యావసర సరుకుల కోసం ఇచ్చిన వెసులుబాటును కొంతమంది దుర్వినియోగం చేస్తూ రోడ్లపై తిరుగుతున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Updated Date - 2020-04-03T12:41:08+05:30 IST