హైదరాబాద్లో కొవిడ్ పేషంట్కు అరుదైన శస్త్రచికిత్స
ABN , First Publish Date - 2020-09-17T12:51:58+05:30 IST
. యువకుడికి తీవ్ర జ్వరం, ఊపిరి అందకపోవడంతో
- పూడుకుపోయిన మూడు రక్తనాళాలు
- స్టంట్లు వేసిన మెడికవర్ వైద్యులు
హైదరాబాద్ : మూడు రక్తనాళాలు పూడుకుపోయి కరోనా వైర్సతో బాధపడుతున్న ఓ యువకుడికి మెడికవర్ వైద్యులు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. యువకుడికి తీవ్ర జ్వరం, ఊపిరి అందకపోవడంతో పది రోజుల క్రితం మెడికవర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతడికి యాంజియోగ్రామ్ చేయగా రెండు రక్తనాళాలు వంద శాతం పూడుకు పోయాయి. మూడో రక్తనాళం 95శాతం పూడుకుందని తేలింది. ఈ క్రమంలో ఆయనకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక వైపు గుండె సమస్య, మరో వైపు కరోనా తీవ్రతతో అతడి పరిస్థితి విషమించింది. దీంతో మెడికవర్ గ్రూప్(ఇండియా) చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ స్వయంగా చికిత్స అందించారు.
వారం రోజుల క్రితం చికి త్స ప్రక్రియ నిర్వహించారు. రోగికి రక్తపోటు తగ్గిపోతున్న విషయాన్ని గమనించి, దానిని నియంత్రణలోకి తీసుకురావడానికి చికిత్స మొదులు పెట్టారు. రక్తపోటు సాధారణ స్థితికి వస్తే ఇతర చికిత్సలు అందించడానికి అవకాశముంటుందని డాక్టర్ అనిల్ కృష్ణ వివరించారు. ఈ క్రమంలో రోగికి ఇంట్రా ఆర్టిక్ బెలూన్ పైపు, ఎలక్టివ్ ఇంట్యూబేషన్ ప్రక్రియలను వినియోగించి చికిత్సను మొదలు పెట్టారు. తర్వాత మల్టీవెసల్ పెర్క్యూటెనియస్ యాంజియోప్లాస్టీ చేసి స్టంట్లు వేసినట్లు తెలిపారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో అన్ని రకాల వైద్య చికిత్సలకు రోగి గుండె తట్టుకుందని తెలిపారు. మూడు రక్తనాళాలు పూడుకుపోయి, కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి 90శాతం ప్రాణాలకు ముప్పు ఉంటుందన్నారు. ఈయువకుడి విషయంలో ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా చికిత్స అందించడంవల్ల త్వరగా కోలుకున్నాడని తెలిపారు. అతడి కుటుంబ సభ్యులకు కొం దరికి గుండె రక్తనాళాలు పూర్తి స్థాయిలో రూపొందని సమస్యలు ఉన్నాయని, దీనిని వైద్య పరిభాషలో ప్రీమెచ్యూర్ కరోనరీ ఆర్టరీగా వ్యవహరిస్తామని పేర్కొన్నా రు. ప్రస్తుతం అతడు కోలుకున్నాడని, డిశ్చార్జి చేశామని తెలిపారు.