నరకయాతన
ABN , First Publish Date - 2022-10-02T17:42:30+05:30 IST
నగరం నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వివిధ జిల్లాలకు వెళ్లే దారులన్నీ శనివారం వాహనాలతో నిండిపోయాయి. ఉదయం 10 తర్వాత రోడ్లపై వేలాదిగా వాహనాలు రావడంతో జనజీవనం
ముందుకు సాగలేక.. వెనక్కి వెళ్లలేక
వేలాది వాహనాలతో స్తంభించిన ట్రాఫిక్
పండుగ నేపథ్యంలో కిక్కిరిసిన రహదారులు
హైదరాబాద్ సిటీ: నగరం నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వివిధ జిల్లాలకు వెళ్లే దారులన్నీ శనివారం వాహనాలతో నిండిపోయాయి. ఉదయం 10 తర్వాత రోడ్లపై వేలాదిగా వాహనాలు రావడంతో జనజీవనం స్తంభించింది. నగరవాసులు నరకయాతన అనుభవించారు. జంక్షన్ల వద్ద పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించలేని పరిస్థితి నెలకొందంటే ఏస్థాయిలో ట్రాఫిక్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. కాగా, వాహనదారులు ట్రాఫిక్లో చిక్కుకుని ముందుకు సాగలేక.. వెనక్కి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా షాపింగ్ చేసే వారితో వాణిజ్య ప్రాంతాలు కిటకిటలాడాయి.
కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
పండగకు సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు శనివారం కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రద్దీగా మారాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎ్సల నుంచి రాత్రి 11 గంటల సమయానికి ఏపీ, తెలంగాణ జిల్లాలకు 800 వరకు ప్రత్యేక బస్సులు వెళ్లాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మూడు రోజులుగా ఏపీ, తెలంగాణ జిల్లాలకు 3.5లక్షల మంది ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం 684 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు
పండుగల నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈనెల 3న సికింద్రాబాద్ నుంచి కటక్ వరకు ప్రత్యేక రైలు (07479), 4న కటక్ నుంచి సికింద్రాబాద్ వరకు (07480) మరో రైలును నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా 4న హైదరాబాద్-యశ్వంత్పూర్((07265), 5న యశ్వంత్పూర్-హైదరాబాద్ (07266), 3, 10 తేదీల్లో హెచ్.ఎస్. నాందేడ్-కాకినాడ టౌన్ మధ్య (07565), 4,11 తేదీల్లో కాకినాడ టౌన్ - హెచ్.ఎస్. నాందేడ్ మధ్య (07566) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.