జడి వాన..!
ABN , First Publish Date - 2022-07-23T16:22:16+05:30 IST
నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో వరద ఉప్పొంగింది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని
దంచికొట్టిన వర్షం
రహదారులపై పోటెత్తిన వరద
నీట మునిగిన కాలనీలు.. స్థానికుల ఇబ్బందులు
పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు
ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్
మహా నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. గంటకు పైగా కుండపోతగా కురిసిన వానతో గ్రేటర్వాసులు వణికిపోయారు. దంచికొట్టడంతో భాగ్యనగరం గడగడలాడింది. రోడ్లన్నీ వరదతో ఉప్పొంగాయి. డ్రైనేజీలు, నాలాలు పొంగిపొర్లాయి. కొన్ని కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. నాలాలు పొంగి ఇళ్లల్లోకి చేరాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించి పోయింది.
హైదరాబాద్ సిటీ: నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన కుండపోత వర్షంతో వరద ఉప్పొంగింది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలోని శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, రాజేంద్రనగర్, రాంచంద్రాపురంలో పడిన వర్షంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా మండలాల్లో 9 సెంటిమీటర్లకు పైగా వర్షం కురియడంతో ఎక్కడ చూసినా వరదే కనిపించింది. సాయంత్రం 4.40 గంటలకు తీవ్రరూపం దాల్చిన వర్షం దాదాపు గంటకు పైగా కొట్టింది. తర్వాత తీవ్రత తగ్గినప్పటికీ వర్షం కొనసాగింది.
శేరిలింగంపల్లి, హైటెక్సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, హఫీజ్పేట్, నిజాంపేట్, అత్తాపూర్, ఆరాంఘర్, టోలీచౌకీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, మైత్రివనం, ఎర్రగడ్డ, బేగంపేట, ఫతేనగర్, మూసాపేట, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, జీడిమెట్లలో శుక్రవారం రాత్రి వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారీ వర్షం నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్ల ద్వారా వెళ్లేందుకు సమీపంలోని స్టేషన్లకు వెళ్లారు. దీంతో ఆయా స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. టికెట్ కొనుగోలు చేసేవారు సర్వర్ మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు.
అప్రమత్తమైన పోలీసులు
వర్షంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేశారని ఉన్నతాధికారులు అభినందించారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు చేతుల్లో చీపుర్లు తీసుకుని మ్యాన్హోల్స్పై ఉన్న చెత్తను తొలగించడం, మ్యాన్హోల్స్లోకి నీరు వెళ్లేలా మార్గాలు సుగమం చేయడం వంటి వీడియోలు వైరల్గా మారాయి.