బల్క్‌ డ్రగ్స్‌ ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2020-03-11T06:48:29+05:30 IST

చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌ను దిగుమతి చేసుకుని బల్క్‌డ్రగ్స్‌ను తయారు చేసే కొన్ని యూనిట్లకు ముడిపదార్థాల కొరత ప్రారంభమైంది. కరోనా వైర స్‌ కారణంగా చైనా...

బల్క్‌ డ్రగ్స్‌ ధరలకు రెక్కలు

‘కరోనా’తో 50% పెరిగాయ్‌  

చైనా నుంచి రవాణా నిలిచిపోవడమే కారణం

నెలాఖరు వరకూ ఇబ్బంది లేదు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌ను దిగుమతి చేసుకుని బల్క్‌డ్రగ్స్‌ను తయారు చేసే కొన్ని యూనిట్లకు ముడిపదార్థాల కొరత ప్రారంభమైంది. కరోనా వైర స్‌ కారణంగా చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌, బల్క్‌ డ్రగ్స్‌ సరఫరా నిలిచిపోయింది. ఇంటర్మీడియెట్స్‌ నిల్వలు మార్చి చివరి వరకూ వచ్చే అవకాశం ఉందని.. పరిస్థితులు ఇలానే కొనసాగితే బల్క్‌ డ్రగ్స్‌ తయారీకి అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని హైదరాబాద్‌లోని ఔషధ పరిశ్రమ వర్గా లు చెబుతున్నాయి. ఫార్ములేషన్లు తయారు చేసే ఖాతాదారుల నుంచి బల్క్‌ డ్రగ్స్‌కు ఆర్డర్లు లభిస్తే.. గతంలో వారంలో సరఫరా చేయగలిగితే, ఇప్పుడు నెలకు పైగా సమయం కోరుతున్నారు. ముడి పదార్ధాల సరఫరాలో అంతరాయం కారణంగా జనవరి చివరి నుంచి పారాసిటమాల్‌ ఽకేజీ ధర రూ.300 నుంచి రూ.600 మించింది. దాదాపు 500 పైగా బల్క్‌డ్రగ్స్‌ను ఔషధ పరిశ్రమ తయారు చేస్తోంది. ఇంటర్మీడియెట్స్‌ లభ్యతలో జాప్యం కారణంగా దాదాపు గత రెండు నెలల కాలంలో బల్క్‌ డ్రగ్స్‌ ధరలు కనీసం 50 శాతం పెరిగినట్లు సం బంధిత వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రభావం ఫార్ములేషన్ల తయారీ యూనిట్లపై కూడా ఉంది. వచ్చే 15-20 రోజుల్లో సరఫరా అంతరాయాలు తొలగిపోవచ్చని పరిశ్రమ భావిస్తోంది. లేదంటే ఏపీఐ ధరలు మరింత పెరగడానికి అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి పర్వాలేదని.. కొనసాగితే ఇబ్బంది తప్పదని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని ఔషధ కంపెనీల వద్ద ఉన్న ఇంటర్మీడియెట్స్‌, బల్క్‌డ్రగ్‌ నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. ఏపీఐల కొరత, లభ్యతలపై నివేదికలు  కోరాయి. 


ఏటా రూ.25 వేల కోట్ల దిగుమతులు

ప్రతి ఏడాది భారత్‌ 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.25,550 కోట్లు) విలువైన రసాయనాలు, ఇంటర్మీడియెట్స్‌, ఏపీఐలను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో దాదాపు 70 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. కొన్ని యూనిట్లు చైనా నుంచి ఇంటర్మీడియెట్స్‌ను దిగుమతి చేసుకుని బల్క్‌డ్రగ్స్‌ను తయారు చేసి ఎగుమతి చేస్తాయి. చైనా కంపెనీలు తక్కువ ధరకు సరఫరా చేయడం వల్ల అధికశాతం కంపెనీలు ఏపీఐలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. కరోనా ప్రభావం కొనసాగితే  ఫెర్మెంటేషన్‌ ద్వారా తయారు చేసే కొన్ని రకాల యాంటీ బయాటిక్స్‌కు కొరత ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్మీడియెట్స్‌, ఏపీఐలు తయారవుతున్నాయి. అయితే.. రవాణా నిలిచిపోవడం వల్లే సరఫరాకు అంతరాయం జరుగుతోందని.. ఈ పరిస్థితి మారిపోగలదని హైదరాబాద్‌కు చెందిన కంపెనీ అధిపతి ఒకరు తెలిపారు. 


ఎగుమతులపై నిషేధంతో ఇబ్బందులు

దేశీయంగా కొరత రాకుండా చూసేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎ్‌ఫటీ) 26 రకాల ఏపీఐలు, వాటితో తయారు  చేసే  ఔషధాల ఎగుమతులపై నిషేధం విధించింది. వీటిలో పారాసిమోల్‌, బీ1, బీ12 విటమిన్లు తదితరాలు ఉన్నాయి. ఎగుమతులపై నిషేధం విధించడంతో భారత్‌ నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్న యూరప్‌ ఆందోళన చెందుతోంది. యూరప్‌ దేశాలు ఫార్ములేషన్లను భారత్‌ నుంచి బాగా దిగుమతి చేసుకుంటున్నాయి. యూర్‌పలో విక్రయించే జనరిక్‌ ఫార్ములేషన్ల మార్కెట్‌లో దాదాపు 25 శాతం వాటా భారత్‌ కంపెనీలదే. భారత ఔషధ ఎగుమతుల్లో నిషేధం విధించిన ఔషధాల వాటా 10 శాతం వరకూ ఉంటుందని అంచనా. అమెరికా జనరిక్‌ ఫార్ములేషన్ల మార్కెట్‌లో కూడా భారత కంపెనీలకు ఇదే స్థాయి వాటా ఉంది. భారత్‌ దాదాపు 200 దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తోంది. ఎగుమతులపై నిషేధం కారణంగా భారత ఔషధ కంపెనీలకు ఆదాయపరంగానే కాక.. రెప్యుటేషన్‌ పరంగా కూడా నష్టం జరుగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-03-11T06:48:29+05:30 IST