బీరు సీసాతో పొడిచి వ్యక్తి హత్య

ABN , First Publish Date - 2022-05-11T18:02:59+05:30 IST

మద్యం మత్తులో మాట మాట పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జిర్రా షాపిబ్రిహిల్స్‌ ప్రాంతానికి

బీరు సీసాతో పొడిచి వ్యక్తి హత్య

హైదరాబాద్/బంజారాహిల్స్‌: మద్యం మత్తులో మాట మాట పెరిగి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. జిర్రా షాపిబ్రిహిల్స్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ చింటూ ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు 2020లో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లాడు. బంజారాహిల్స్‌ ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన మహ్మద్‌ అమేర్‌ (22)కూడా దొంగతనం కేసులో చంచల్‌గూడ జైలుకు వెళ్లాడు. వీరిద్దరికీ జైలులో పరిచయమైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా వీరి స్నేహం కొనసాగింది. చిల్లర దొంగతనాలు చేయడం, మద్యం సేవించడం, గొడవపడి కొట్టుకోవడం వీరికి నిత్యకృత్యమైంది. సోమవారం ఇద్దరూ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బీరు తాగారు. అనంతరం జరిగిన గొడవలో అమేర్‌ బీరు సీసాతో ఒమర్‌ ముఖం, కడుపు, మెడపై పొడిచి హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతుడి తల్లి జకీరాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more