హుజూరాబాద్ పోలింగ్ సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2021-10-30T01:08:46+05:30 IST
సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకున్నది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం
హుజురాబాద్: సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకున్నది. శనివారం పోలింగ్ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకొని సర్వసన్నద్ధమయ్యారు. ఓటర్లు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తలరాతలను శనివారం రాయనున్నారు. నియోజకవర్గంలో 1,17,922 మంది పురుషులు, 1,19,099 మంది స్ర్తీలు, ఒక థర్డ్ జెండర్, మొత్తం 2,37,022 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు శనివారం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఓటింగ్ పూర్తికాగానే ఈవీఎంలను, వీవీ ప్యాట్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలకు తరలిస్తారు. వీటిని భద్రపరిచేందుకు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 2న ఇక్కడే ఓట్ల లెక్కింపు జరగనున్నది.