హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-08-19T00:47:19+05:30 IST
హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు.
హుజురాబాద్: హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్లో 42 వేల మంది దళిత ఓటర్లు ఉండడంతోనే అక్కడ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. హుజూరాబాద్ ఎన్నికల భయంతోనే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించారని ఆరోపించారు. రెండున్నరేళ్లు గడిచినా 57ఏళ్ల వయస్సు వారికి ఆసరా పథకాన్ని పట్టించుకోని సీఎం కేసీఆర్ నేడు దరఖాస్తులను తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను చెల్లించక పోవడంతోనే రైతులకు ఎలాంటి నష్టపరిహారం రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 120 కోట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చెల్లిస్తే రైతులకు 800 కోట్ల పరిహారం అందేదన్నారు.