హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేసులో ముగ్గురి పేర్లు..!

ABN , First Publish Date - 2021-09-29T09:25:08+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ వేగంగా అడుగులు ముందుకేస్తోంది.

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేసులో ముగ్గురి పేర్లు..!

హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం.. నేడు కొలిక్కి వచ్చే అవకాశం

రేపు ప్రకటించేందుకు కసరత్తు! 

కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ,పత్తి కృష్ణారెడ్డి పేర్ల పరిశీలన! 


హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌ వేగంగా అడుగులు ముందుకేస్తోంది. అనేక తర్జన భర్జనలు, స్థానిక నేతల అభిప్రాయాల సేకరణ జరిపి ప్రతిపాదిత పేర్లనూ అఽధిష్ఠానానికి పంపింది. మాజీ మంత్రి కొండా సురేఖ, కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, స్థానిక రైతు నాయకుడు పత్తి కృష్ణారెడ్డి.. మరో బీసీ నేత పేర్లను పరిశీలన కోసం పంపినట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొండా సురేఖ అభ్యర్థిత్వానికే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నా.. భవిష్యత్తు ఎన్నికల్లో తన వర్గానికి భూపాలపల్లి, వరంగల్‌, పరకాలల్లో రెండు నియోజకవర్గాలను కేటాయించాల్సిందగా ఆమె కోరుతున్నట్లు చెబుతున్నారు. అయితే అన్ని అంశాలపైనా బుధవారం పార్టీ రాష్ట్ర నాయకులతో అధిష్ఠానం సంప్రదింపులు జరిపి, గురువారంనాడు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారంనాడూ కొలిక్కిరాని పక్షంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌.. రాష్ట్ర నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించి అక్టోబరు మొదటి వారంలో అభ్యర్థిని ప్రకటించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. మెదక్‌ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ నేతలతో సమీక్ష సమావేశానికి వచ్చి అక్టోబరు 2న విద్యార్థి, నిరుద్యోగుల సైరన్‌ కార్యక్రమం ప్రారంభోత్సవం వరకూ హైదరాబాద్‌లోనే ఠాగూర్‌ ఉంటారు. హుజూరాబాద్‌ అభ్యర్థి నిర్ణయంలో ప్రతిష్ఠంభన కొనసాగితే.. ఈ మధ్యలోనే ఆయన పార్టీ నేతలతో మాట్లాడి అధిష్ఠానానికి సింగిల్‌ పేరును సూచించనున్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-09-29T09:25:08+05:30 IST