హూజురాబాద్‌లో ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు దూరం

ABN , First Publish Date - 2021-10-22T17:49:08+05:30 IST

హుజురాబాద్‌లో ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు దూరంగా ఉండనున్నారు.

హూజురాబాద్‌లో ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు దూరం

కరీంనగర్: హుజురాబాద్‌లో ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు దూరంగా ఉండనున్నారు. బహిరంగ సభలకు ఈసీ నిబంధనలు అడ్డుగా నిలిచాయి. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ  రద్దు అయ్యింది. రాష్ట్ర నేతలు, స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారంతోనే బీజేపీ అభ్యర్థి ఈటల సరిపెట్టుకోనున్నారు. అధికార టీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీంతో జాతీయ నేతల సభలు, సమావేశాలతో టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టాలని కాషాయపార్టీ  భావించింది.  ముందుగా అమిత్ షాతో హుజరాబాద్‌లో బహిరంగ సభకు బీజేపీ ప్రణాళికను రూపొందించింది.


జాతీయ నేతలు ప్రచారానికి దూరం కావడంతో  హుజురాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేతలు మూకుమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  బండి సంజయ్, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, డీకే అరుణ,  జితేందర్ రెడ్డి సహా ముఖ్యనేతలు హుజరాబాద్‌లో మకాం వేశారు. నేటి నుంచి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హుజురాబాద్ ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా కోర్టు కేసుల కారణంగా  బీజేపీ శాసనసభ పక్షనేత రాజసింగ్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. 

Updated Date - 2021-10-22T17:49:08+05:30 IST