లైన్‌మ్యాన్‌పై చర్యలకు హుస్నాబాద్‌ డీఈకి సిఫారసు

ABN , First Publish Date - 2022-09-29T04:47:58+05:30 IST

ఒక్కో డీడీ అప్లికేషన్‌కు వెయ్యి సమర్పించాల్సిందేనంటూ లైన్‌మ్యాన్‌ పంతం సతీష్‌ డిమాండ్‌ చేయడంతో బాధిత రైతు జెల్ల శ్రీశైలం చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం దూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌ ఆమ్లెట్‌ విలేజ్‌ జెల్లగూడంలో విద్యుత్‌ ఏఈ శ్రీనివా్‌సరావు ఏడీ రత్నాచారితో కలిసి విచారణ చేపట్టారు.

లైన్‌మ్యాన్‌పై చర్యలకు హుస్నాబాద్‌ డీఈకి సిఫారసు
లింగాపూర్‌ జెల్లగూడెంలో బాధిత రైతు నుంచి విచారణ చేపడుతున్న ఏఈ

మద్దూరు, సెప్టెంబరు 28: ఒక్కో డీడీ అప్లికేషన్‌కు వెయ్యి సమర్పించాల్సిందేనంటూ లైన్‌మ్యాన్‌ పంతం సతీష్‌ డిమాండ్‌ చేయడంతో బాధిత రైతు జెల్ల శ్రీశైలం చేసిన ఫిర్యాదు మేరకు బుధవారం దూళిమిట్ట మండలంలోని లింగాపూర్‌ ఆమ్లెట్‌ విలేజ్‌ జెల్లగూడంలో విద్యుత్‌ ఏఈ శ్రీనివా్‌సరావు ఏడీ రత్నాచారితో కలిసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతు వద్ద నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 13న రైతు జెల్ల శ్రీశైలం తీసిన 4 డీడీలకు అప్లికేషన్‌ రాసేందుకు ఒక్కో అప్లికేషన్‌కు రూ.వెయ్యి ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో పూర్తిస్థాయిలో డబ్బులు లేని కారణంగా రూ.2 వేలు సమర్పించినట్లు తెలిపారు. మిగతా డబ్బులు పని పూర్తయ్యాక ఇస్తానని తెలిపాడు. సమస్య ఉన్నప్పుడు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని చెప్పగా, తనకు తెలియదని బదులివ్వడంతో బాధిత రైతు వద్ద నుంచి చేపట్టిన విచారణను పూర్తిగా నివేదిక రూపంలో హుస్నాబాద్‌ డీఈ శ్రీనివాసులకు అందజేయనున్నట్లు తెలిపారు. రైతులెవరూ విద్యుత్‌ సిబ్బందికి డబ్బులు ఇవ్వరాదని సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు. 

లింగాపూర్‌లైన్‌మ్యాన్‌ను సస్పెండ్‌ చేయాలి

చేర్యాల, సెప్టెంబరు 28: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల విషయంలో రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న లింగాపూర్‌ లైన్‌మ్యాన్‌ సతీ్‌షను సస్పెండ్‌ చేయాలని రైతు సంఘం చేర్యాల మండల కార్యదర్శి కత్తుల భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లంచాలు దండుకుంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న విషయమై విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చే శారు. 

Updated Date - 2022-09-29T04:47:58+05:30 IST