ఇంటర్నెట్ డెస్క్: వీధిలో నడుచుకుంటూ వెళుతున్న అతడికి..కొంత దూరంలో భార్య కనిపించింది. ఎవరో యువకుడితో మాట్లాడుతోంది. దీంతో..అతడిలో కోపం కట్టలు తెంచుకుంది. తల్లిదండ్రులను, తన స్నేహితులను పిలిపించి నడవిధీలో భార్యను చావచితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె దుస్తులు కూడా చిరిగిపోయాయి. ఆమె జాకెట్ స్థానభ్రంసమైనా అతడు లెక్కపెట్టకుండా ఆమెను చావబాదాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్ పూర్ జిల్లాలో శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
భార్యపై అతడికి అప్పటికే అనుమానం ఉన్నట్టు సమాచారం. దీంతో.. వీధిలో పరాయి పురుషుడితో భార్య మాట్లాడుతూ కనిపించడంతో అతడు రెచ్చిపోయాడు. వెంటనే తన తల్లిదండ్రులను, ఇద్దరు స్నేహితులను రప్పించాడు. ఆ తరువాత.. ఆమెపై దాడి చేశాడు. తండ్రి, స్నేహితులతో కలిసి భార్యను చావబాదాడు. ఆమె దస్తులు చిరిగిపోయినా అతడు లెక్క చేయలేదు. సాటి మహిళ అయి ఉండి కూడా అత్త.. తన కుమారుడిని కోడలిపై మరింతగా ఉసిగొలిపింది. భార్యతో పాటూ ఉన్న యువకుడిని కూడా భర్త, అతడి స్నేహితులు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విషయం పోలీసులకు చేరింది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు..దర్యాప్తు ప్రారంభించి..భర్తతో పాటు అతడికి సహకరించిన వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే..అక్షరాస్యత పెంచడం ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తమ హక్కుల పట్ల కూడా మహిళల్లో అవగాహన కల్పించాలని వారు అభిప్రాయపడుతున్నారు.