భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని.. అత్తింటి వద్ద నిరసన

ABN , First Publish Date - 2022-05-27T04:59:46+05:30 IST

భర్త రెండో పెళ్లి చేసుకుని ఇంట్లోకి రానీయలేదని ఓ మహిళ గురువారం అత్తింటి వద్ద నిరసనకు దిగింది.

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని..  అత్తింటి వద్ద నిరసన
కుమారుడితో కలసి అత్తింటి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సుధ

మదనపల్లె క్రైం, మే 26: భర్త రెండో పెళ్లి చేసుకుని ఇంట్లోకి రానీయలేదని ఓ మహిళ గురువారం అత్తింటి వద్ద నిరసనకు దిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు..మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ కొత్తిండ్లకు చెందిన బాలప్రసాద్‌ 2014లో కర్ణాటక రాష్ట్రం కోలారు సమీపంలోని దేవరపల్లెకు చెందిన సుధను వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల కుమారుడు బాలాజీ ఉన్నాడు. కాగా బాలప్రసాద్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుండేవాడు. కొద్దిరోజుల పాటు వారి కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత సుధకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె 2016లో అత్తింటివారిపై తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. కాగా బాలప్రసాద్‌కు అతడి కుటుంబీకులు మూడు నెలల కిందట రెండో పెళ్లి చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుధ బుధవారం కుమారుడితో కలసి అత్తింటికి వచ్చింది. ఈ క్రమంలో భర్త, అత్తింటివారు ఆమెను ఇంట్లోకి రానీయకపోవడంతో రాత్రంతా అక్కడే ఉండిపోయింది. దీంతో చేసేదిలేక గురువారం అత్తింటి వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. విషయం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌లు అక్కడకు చేరుకుని బాధిత మహిళను విచారించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ విడాకులు తీసుకోకుండా రెండోపెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. వరకట్న వేధింపుల కేసు కొట్టేసిన నేపథ్యంలో సుధకు ప్రతినెలా భరణం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ ప్రకారం ఆమెకు జీవనాధారం కల్పించాలన్నారు. లేకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.

Updated Date - 2022-05-27T04:59:46+05:30 IST