భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ దాడి చేయగా..

ABN , First Publish Date - 2020-10-31T19:14:05+05:30 IST

విశాఖలో దారుణం చోటుచేసుకుంది.

భార్యపై అనుమానంతో భర్త యాసిడ్ దాడి చేయగా..

విశాఖపట్నం : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. సంతోషంగా వారి కుటుంబంలోకి అనుమానం అనే పెనుభూతం చొరబడింది. దీంతో ఏకంగా భార్యనే హత్య చేయాలని ప్లాన్ చేశాడు. శనివారం నాడు భార్యపై భర్త యాసిడ్‌ దాడి చేశాడు. సరిగ్గా ఇదే టైమ్‌లో కూతురు అడ్డు రాగా చేతిపై పడింది. ఈ ఘటనలో భార్య, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆ యాసిడ్ బాత్రూమ్‌ క్లీనింగ్‌ వాడేది కావడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలోని శివాజీ పాలెంలో చోటు చేసుకుంది. 


పూర్తి వివరాల్లోకెళితే.. ఈశ్వరరావు అనే పెయింటర్ భార్య దేవి, కుమార్తె గాయత్రితో కలిసి శివాజీ నగర్‌లో నివాసముండేవాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ భార్యతో నిత్యం గొడవపడుతుండేవాడు. అలా భార్యతో రోజూ జరుగుతున్న గొడవల నేపథ్యంలో అనుమానం పెంచుకున్న భర్త ఏకంగా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-10-31T19:14:05+05:30 IST