తాగొద్దన్నందుకు భార్యను హత్య చేసిన భర్త
ABN , First Publish Date - 2021-03-25T13:28:43+05:30 IST
రవి కుటుంబం హైదర్గూడ మైసమ్మ బావి సమీపంలో అద్దెకు ఉంటుండగా...
హైదరాబాద్/రాజేంద్రనగర్ : తాగి రావద్దని చెప్పినందుకు భార్యను ముక్కు మూసి, ఊపిరాడకుండా చేసి హత్య చేశాడో భర్త. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన పెసర్ల రవికి 2017లో సమత(25)తో వివాహం జరిగింది. వీరికి బాబు ఉన్నా డు. రవి కుటుంబం హైదర్గూడ మైసమ్మ బావి సమీపంలో అద్దెకు ఉంటుండగా, సమత అన్న శ్రీకాంత్ తల్లిదండ్రులతో హైదర్గూడ బస్టాప్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. కారు డ్రైవర్గా పనిచేసే పెసర్ల రవి రోజూ మద్యం తాగి వస్తుండటంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. సమత సోదరుడి ఇంటికి వెళ్లి సోమవారమే వచ్చింది. మంగళవారం రాత్రి కూడా రవి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. సమత తాగవద్దని చెప్పాను కదా.. అంటూ గొడవకు దిగింది. దీంతో ఇద్దరికి మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన రవి సమత ముక్కు, మూతి మూసి ఊపిరాడకుండా చేయడంతో ఆమె మరణించింది.
పోలీసులకు సోదరుడి ఫిర్యాదు..
అనారోగ్యంగా ఉన్న చెల్లి పరిస్థితి ఎలా ఉందోనని తెలుసుకోవడానికి సోదరుడు శ్రీకాంత్ సమతకు మంగళవారం రాత్రి ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో బావకు ఫోన్ చేశాడు. ఆయన నుంచి కూడా సమాధానం రాలేదు. కాసేపటి తర్వాత రవి శ్రీకాంత్కు ఫోన్ చేసి మీ చెల్లెలు తలుపు పెట్టుకుంది. తీయడం లేదని చెప్పాడు. సమీపంలోనే ఉండే శ్రీకాంత్ మరో సోదరి ఇంటికి వచ్చి చూడగా ఆమె చనిపోయి ఉంది. దీంతో శ్రీకాంత్ రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రాజేంద్రనగర్, మైలార్దేవుపల్లి ఇన్స్పెక్టర్లు కె.కనకయ్య, కె.నర్సింహ్మ, ఎస్ఐ శ్వేత సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తాగి రావద్దన్నందుకు రవి సమతను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపారు. సమత అన్న శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.