భర్తను రోకలి బండతో కొట్టి ఆపై దహనం
ABN , First Publish Date - 2022-01-18T04:02:36+05:30 IST
నిత్యం మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య రోకలిబండతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిం ది. ఆ తరువాత పోలీసుస్టేషన్కు వెళ్లి ఆమె లొంగిపోయింది.
మద్యం తాగి తరచూ భార్యను వేధిస్తున్న కారణంగానే హత్య?
విచారణ చేపట్టిన పోలీసులు
గిద్దలూరు టౌన్, జనవరి 17 : నిత్యం మద్యం సేవించి వేధిస్తున్న భర్తను భార్య రోకలిబండతో కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిం ది. ఆ తరువాత పోలీసుస్టేషన్కు వెళ్లి ఆమె లొంగిపోయింది. పోలీసుల కథనం.. ప్రకారం గిద్దలూరు పట్టణంలోని శ్రీరామ్నగర్లో నివాసం ఉంటూ చిరువ్యాపారం చేసుకుంటున్న మేకల అంజి(32), అంకాలమ్మకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లు దంపతులిద్దరూ అన్యోన్యం గా ఉన్నారు. తర్వాత భర్త మద్యానికి బానిస కావడంతో అంకాలమ్మపై వేధింపులు ఎక్కువయ్యాయి. అనేక సందర్భాలలో భర్తకు నచ్చచెప్పడం కూడా జరిగింది. ఆదివారం కనుమపండుగ రోజున అంజి మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. కొంత సేపటికి ఘర్షణ పెద్దదయింది. ఆగ్రహించిన భార్య అంకాలమ్మ రోకలి బండతో భర్తపై దాడికి దిగింది. తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్న అంజిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. దీంతో అంజి మృతి చెందాడు. వెంటనే అంకాలమ్మ పోలీసుస్టేషన్కు వెళ్లి జరిగిన సంఘటనను వివరించింది. వెంటనే సంఘటన స్థలాన్ని సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్ఐ బ్రహ్మనాయుడు పరిశీలించి కేసు నమోదు చేశారు. అంజి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం మార్కాపురం డీఎ్సపీ కిశోర్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.
వాహనం ఢీ.. గుర్తు తెలియని వ్యక్తి మృతి
సింగరాయకొండ, జనవరి 17 : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆచూకీ తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జాతీయ రహదారిపై ఉన్న పోలేరమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. జాతీయ రహదారిపై ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో సుమారు 60 నుంచి 65 ఏళ్లు ఉన్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మూలగుంటపాడు వీఆర్వో కారుమంచి వెంకట్రావు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి గురించి విచారించగా భిక్షాటన చేసే వ్యక్తిగా తెలిసింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు ఎస్సై ఎల్. సంపత్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.