కొవిడ్తో భర్త మృతి.. ఆ వెనుకే భార్య ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-04-17T07:42:08+05:30 IST
కరోనా.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కొవిడ్తో మృతి చెందడాన్ని తట్టుకోలేకపోయిన ఆ భార్య.. చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకోగా..
తల్లినే అనుసరించి మూడేళ్ల చిన్నారి కూడా..
కరోనాతో ఛిద్రమైన తెలంగాణకు చెందిన ఓ కుటుంబం
నాందేడ్, ఏప్రిల్ 16: కరోనా.. ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. భర్త కొవిడ్తో మృతి చెందడాన్ని తట్టుకోలేకపోయిన ఆ భార్య.. చెరువులోకి దిగి ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మూడేళ్ల కుమారుడు కూడా తల్లినే అనుసరించి అదే చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో.. వారికున్న మరో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాధ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. తెలంగాణకు చెందిన భార్యాభర్తలు.. తమ ముగ్గురు పిల్లలతో కలిసి నాందేడ్ జిల్లా లేహ్కు వలస వెళ్లారు. భర్త(40)కు ఇటీవల కరోనా సోకడంతో 13న మృతి చెందాడు. దీంతో.. తీవ్ర వేదనకు గురైన అతడి భార్య(33) బుధవారం స్థానిక సునేగాన్ లేక్లోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఎక్కడికి వెళుతోందో అర్థంకాని ఆమె మూడేళ్ల చిన్నారి ఆమె వెనుకే చెరువులోకి వెళ్లిపోయి మృతి చెందాడు. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.