భర్త మృతి.. ఐదు నెలలకే భార్య అదృశ్యం
ABN , First Publish Date - 2022-05-18T05:40:33+05:30 IST
ఐదు నెలల క్రితం భర్త మరణించాడు. ఇద్దరు పిల్లలతో ఉంటున్న మహిళ ఇటీవల బయటకెళ్లి అదృశ్యమైంది.
అనాథలైన చిన్నారులు
తూప్రాన్ (మనోహరాబాద్), మే 17: ఐదు నెలల క్రితం భర్త మరణించాడు. ఇద్దరు పిల్లలతో ఉంటున్న మహిళ ఇటీవల బయటకెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారులిద్దరు అనాథలయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద చోటు చేసుకున్నది. మనోహరాబాద్ ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం రామాయపల్లికి చెందిన జక్కుల నాగరాజు, జక్కుల విమల దంపతులకు హర్షవర్ధన్(10), హేమంత్(8 నెలలు) సంతానం. నాగరాజు అనారోగ్యంతో గత ఏడాది డిసెంబరు 8న మృతి చెందాడు. ఇద్దరు కుమారులను పోషించుకుంటూ నాగరాజు భార్య విమల రామాయపల్లిలోనే నివాసముంటున్నది. ఈ నెల 5న ఉదయం విమల పిల్లలిద్దరిని ఇంట్లోనే ఉంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో బంధువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మృతుడు నాగరాజు తండ్రి అయిన జక్కుల అంజయ్య మంగళవారం మనోహరాబాద్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజుగౌడ్ వివరించారు. తండ్రి మరణించడం, తల్లి విమల కనిపించకుండా పోవడంతో చిన్నారులైన హర్షవర్ధన్, 8నెలల హేమంత్ అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు వృద్ధులైన నాయనమ్మ, తాత అయిన సుగుణమ్మ, ఆంజయ్య వద్ద ఉంటున్నారు. చిన్నారులు అనాథలు కావడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.