ఇంటి ముందు ఉన్న స్తంభానికి భార్యను కట్టేసి చితకబాదిన భర్త.. అతడు ఇంత దారుణానికి ఒడిగట్టడం వెనుక..
ABN , First Publish Date - 2022-07-20T22:06:54+05:30 IST
ఆగ్రాకు సమీపంలోని సికంద్రా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు.
ఆగ్రాకు సమీపంలోని సికంద్రా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. మానవత్వం మరిచి గ్రామస్తులందరి ముందూ ఆమెను దారుణంగా హింసించాడు. ఆమెను ఇంటి నుంచి ఈడ్చుకెళ్లి ఓ స్థంభానికి కట్టేసి దారుణంగా కొట్టాడు. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో బాధితురాలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు సమీపంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి..
రోడ్డు పక్కన పాడుబడ్డ ఇంట్లోకి ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు.. ఓ గదిలో కనిపించిన దృశ్యం చూసి షాక్.. భయంతో కేకలు వేస్తూ బయటకొచ్చి..!
ఆగ్రాకు చెందిన కుసుమా దేవి (38)కి 17 ఏళ్ల క్రితం శ్యామ్ బిహారీతో వివాహమైంది. శ్యామ్ బిహారీ తాగుడుకు బానిసై భార్యను చిత్ర హింసలు పెట్టేవాడు. రోజు తాగేసి ఇంటికెళ్లి భార్యను కొట్టేవాడు. దీంతో రోజూ ఆమె ఏడుస్తూనే నిద్రపోయేది. మూడు నెలల క్రితం తీవ్రంగా కొట్టడంతో కుసుమ దవడ విరిగి 15 రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టింది. అనంతరం గ్రామస్థులు శ్యామ్ బిహారీతో మాట్లాడారు. భవిష్యత్తులో కుసుమను ఎప్పుడూ కొట్టనని వాగ్దానం చేయడంతో కుసుమను ఆమె తల్లిదండ్రులు అత్తింటికి పంపించారు.
మళ్లీ ఈ నెల 13న కుసుమను భర్త దారుణంగా కొట్టాడు. ఆ తర్వాతి రోజు ఉదయం కుసుమ తన కొడుకుతో కలిసి రుంక్టా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తిరిగి ఇంటికి వెళ్లిన కుసుమను భర్త, అత్త ఇంటి బయట ఉన్న స్తంభానికి కట్టేసి గంటపాటు కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధిత మహిళ నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఇప్పటికైనా చర్యాలు తీసుకోకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోతానని పేర్కొంది.