ధర్మసాగర్ సీఐపై వేటు
ABN , First Publish Date - 2020-09-22T06:25:22+05:30 IST
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ సీఐ ఎమ్డీ షాదుల్లాబాబాపై వేటు పడింది. ఆయనను ఏఆర్కు అటాచ్
ఏఆర్కు అటాచ్ చేసిన ఇన్చార్జి సీపీ
వరంగల్ అర్బన్ క్రైం, సెప్టెంబరు 16: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ధర్మసాగర్ సీఐ ఎమ్డీ షాదుల్లాబాబాపై వేటు పడింది. ఆయనను ఏఆర్కు అటాచ్ చేస్తూ ఇన్చార్జి సీపీ ప్రమోద్కుమార్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల క్రితం రాంపూర్, కరుణాపురం ప్రాంతాల్లో వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు రెండు విలువైన కార్లు, రూ.5లక్షల విలువైన గుట్కాలు, అంబర్ ప్యాకెట్లను పట్టుకున్నారు. పట్టుకున్న ప్రాపర్టీపై కేసు నమోదు చేసి ధర్మసాగర్ పోలీసులకు అప్పగించారు. అయితే కొద్దిరోజుల తర్వాత సీఐ షాదుల్లాబాబా నిందితుల వద్ద రూ.5లక్షలు తీసుకుని కేసు ముగియకుండానే టాస్క్ఫోర్స్ పట్టుకున్న గుట్కాలు, కార్లను తిరిగి నిందితులకు అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఇన్చార్జి సీపీ ప్రమోద్కుమార్, స్పెషల్బ్రాంచీ సిబ్బందితో దర్యాప్తు చేయించారు. సాదుల్లాబాబా చేసింది తప్పేనని ధ్రువీకరించిన తర్వాత బుధవారం సాయంత్రం సీఐని వరంగల్ ఏఆర్ (ఆర్డ్మ్ రిజర్వ్) విభాగానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో అవినీతికి పాల్పడిన మరో ఇద్దరు సీఐలపైనా దర్యాప్తు చేస్తున్నట్టు నిఘా విభాగం పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుశాఖలో పనిచేస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించినవారు ఎవరైనా వదిలేది లేదని ప్రమోద్కుమార్ స్పష్టం చేశారు.