గుండ్లకమ్మ రిజర్వాయర్లో వేటకు విరామం
ABN , First Publish Date - 2022-07-02T05:04:10+05:30 IST
గుండ్లకమ్మ రిజర్వాయర్లో శుక్రవారం నుంచి రెండు నెలలపాటు వేట విరామం ప్రకటించారు.
రెండు నెలల పాటు వేట నిషేధం
రెండు జిల్లాల పరిధిలో రిజర్వాయర్ ప్రాంతం...
పర్యవేక్షణ అంతంత మాత్రమే
ఆగని చేపల వేట
అద్దంకి, జూలై 1: గుండ్లకమ్మ రిజర్వాయర్లో శుక్రవారం నుంచి రెండు నెలలపాటు వేట విరామం ప్రకటించారు. ప్రతిఏటా జూలై, ఆగస్టు నెలలలో వేట విరామం ఉంటుంది. చేపల పునరుత్పత్తి, ఎదుగుదలకు వీలుగా వేట నిషేధం కొనసాగుతుంది. గుండ్లకమ్మ రిజర్వాయర్ ఆధారంగా అద్దంకి, కొరిశపాడు, మద్దిపాడు, చీమకుర్తి, తాళ్ళూ రు మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల మంది జాలర్లు చేపల వేట సాగిస్తుంటారు. ప్రతి ఏడాది సెప్టెంబరు 1 నుంచి ప్రారంభమయ్యే చేపల వేట జూన్ 30 వరకు పది నెలల కాలం కొనసాగుతుంది. జూలై, ఆగస్టు నెలలలో మాత్రం చేపల వేట నిషేధం ఉంటుంది. ఈ రెండు నెలల పాటు జాలర్లు వేరే పనులకు వెళ్తుంటారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా గ్రామాలలో మత్స్యశాఖ అధికారులు పర్యటించి చేపల వేట సాగించరాదని జాలర్లు చెప్పటం కూడా జరిగింది. అయితే, చక్రాయపాలెం లోని మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ పోస్టు గత కొంత కాలంగా ఖాళీగా ఉండగా, కారంచేడు అధికారికి ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ అధికారి కూడా బదిలీ కావటంతో పోస్టు ఖాళీగా ఉంది. దీంతో పర్యవేక్షణ చేసే అధికారి కూడా లేకుండా పోయారు. అధికారులు బదిలీల హడావుడిలో ఉండటంతో జాలర్లు వేట విరామ కాలాన్ని పక్కన పెట్టి శుక్రవారం కూడా రిజర్వాయర్లో వేట సాగించారన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు వేటకు దూరంగా ఉన్నా, ఇంకొందరు వేట సాగిస్తుండటంతో మిగిలిన వారు కూడా వేట సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చేపల పునరుత్పత్తి కి ఆటంకం కలగటంతో పాటు చేపల ఎదుగుదల ఉండే అవకాశం ఉండదని పలువురు జాలర్లు అభి ప్రాయపడుతున్నారు. వేట పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుందని అలా కాకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తే చేపల వేట నిషేఽధానికి తూట్లు పడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రిజర్వాయర్ ప్రాంతం అటు ప్రకాశం, ఇటు బాపట్ల జిల్లాల పరిధిలో ఉండటంతో రెండు జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించే చేపల వేట నిషేధం ఖచ్చితంగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. స్థానిక గ్రామాల జాలర్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిర పడ్డ జాలర్లతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి తోడు చిన్న కన్ను వలలు, బుట్టల ద్వారా చేపల వేట నిషేధం ఉన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జాలర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తుండటం కూడా చేపలు ఎదుగుదల లేకుండా పోతున్నాయని పలువురు జాలర్లు అభిప్రాయపడుతు న్నారు. అధికారులు ఒకింత కఠినంగా వ్యవహరిస్తేనే రిజర్వాయర్లో మత్స్య సంపద ఎదుగుదల సాధఽ్యమవుతుందని పలువురు అభి ప్రాయపడుతున్నారు.