హ్యూమన్ చెకింగ్ కీలకం: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ
ABN , First Publish Date - 2020-09-25T17:40:58+05:30 IST
ఆలయాల్లో హ్యూమన్ చెకింగ్ ప్రధానమైనదని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్..
అన్నవరం ఆలయంలో భద్రతపై ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ సమీక్ష
అన్నవరం(తూర్పు గోదావరి): ఆలయాల్లో హ్యూమన్ చెకింగ్ ప్రధానమైనదని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ అరుణ్బోస్ తెలిపారు. ఇటీవల ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అన్నవరం ఆలయ భద్రతపై ఎస్పీఎఫ్, సివిల్, అగ్నిమాపకశాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. ఆలయంలో ఆస్తుల భద్రతే కాకుండా భక్తుల భద్రత కూడా ప్రధానమైనదేనన్నారు. తూర్పు, పశ్చిమరాజ గోపురం వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి మహిళలు, పురుషులను తనిఖీ చేసి ఆలయంలోకి అనుమతించాలని సూచించారు.
బ్యాగ్ స్కానర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే 102 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తుండగా మరో 102 నాణ్యత కలిగిన సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు పిలిచామని ఈవో త్రినాథరావు తెలిపారు. టోల్గేట్, మెట్లమార్గం వద్ద తనిఖీలు విధిగా చేపట్టాలని అరుణ్బోస్ సూచించారు. హుండీల వద్ద కొన్ని చోట్ల తాళాలు లేవని, మొబైల్స్, కెమెరాలతో తీసుకుని పలువురు వస్తున్నారని, కరెంట్ పోయిన సందర్భంలో చార్జింగ్ లైట్లు లేవని ఎస్పీఎఫ్ అధికారుల పరిశీలనలో వెల్లడైందని, ఇవి సరిచేయాలని అన్నారు. ఆలయంలో భద్రతా సిబ్బంది కేవలం ఆలయ పరిధిలో ఉన్నారని పోలీస్శాఖకు జాయింట్ కంట్రోల్ అప్పగించాలని ఎస్ఐ రవికుమార్ అన్నారు.
పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావుతో మాట్లాడుతూ అన్నవరం ఆలయంలో ఎటవంటి చిన్న సంఘటన జరిగినా అది వివాదమవుతుందని కాబట్టి భద్రతా సిబ్బంది నిత్యం అప్రమత్తతతో వ్యవహరించి విధులు నిర్వహించాలన్నారు. సహాయ కమిషనర్ రమేష్బాబు, పీఆర్వో కొండలరావు, అగ్నిమాపకశాఖ అధికారులు పాల్గొన్నారు.