ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన

ABN , First Publish Date - 2020-11-01T06:59:03+05:30 IST

అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రభుత్వం సవరణలతో అవకాఽశం ఇచ్చిన నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం వరకు లక్షకు పైగానే దరఖాస్తులు దాఖలయ్యాయి

ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీ స్పందన

ఖమ్మంలో 95,115, భద్రాద్రిలో 14వేల549 దరఖాస్తులు

ఫీజుల రూపంలో సుమారు రూ. 12 కోట్ల ఆదాయం


ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు 31: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రభుత్వం సవరణలతో అవకాఽశం ఇచ్చిన నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం వరకు లక్షకు పైగానే దరఖాస్తులు దాఖలయ్యాయి. నగరపాలక సంస్థ, పురపాలక సంస్థలు లైసెన్స్‌లు ఇచ్చిన సర్వేయర్ల ద్వారా, మీసేవా కేంద్రాల్లో, యాప్‌ల ద్వారా ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ప్రభుత్వం శనివారం వరకు గడువు ఇచ్చింది. అధికారుల వద్ద నమోదైన సమాచారం ప్రకారం శనివారం వరకు ఖమ్మం జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 95, 115, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14వేల549 దరఖాస్తులు వచ్చాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఒకలక్ష 9వేల దరఖాస్తులు రాగా ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 95వేల115 రావటం గమనార్హం. ఖమ్మం జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా రూ.10.03 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో రూ.1.51కోట్ల ఆదాయం వచ్చింది. కాగా శనివారంతో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులకు ముగుస్తుండగా, ప్రభుత్వం గడువు పెంచుతుందని భావిస్తున్నారు.


ప్లాట్లు లే-అవుట్ల వివరాలివి..

ఖమ్మం జిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్‌కు 95వేల115 దరఖాస్తులు రాగా రిజిస్ట్రేషన్‌ ఫీజు రూపంలో రూ.10,03 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ దరఖాస్తుల్లో  వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు 94వేల532 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తుల రిజిస్ర్టేషన్‌ ద్వారా ద్వారా రూ.9.45 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక లేఅవుట్లు (వెంచర్లు) క్రమబద్ధకరణకు 583 దరఖాస్తులు రాగా, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.58.30 లక్షలు వచ్చాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14వేల549 దరఖాస్తులు రాగా రూ.1,51 కోట్లు ఆదాయం వచ్చింది. దీనిలో వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు 14వేల480 దరఖాస్తులు రాగా, రిజిస్ట్రేషన్‌ ఫీజు ద్వారా రూ.1.44 కోట్లు వచ్చాయి. ఇక వెంచర్లకు 69 దరఖాస్తులు రాగా రూ.6.90 లక్షలు ఆదాయం వచ్చింది. కాగా ఎల్‌ఆర్‌ఎస్‌ మొత్తం ఫీజు ద్వారా ఉమ్మడి జిల్లాలో రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-11-01T06:59:03+05:30 IST