అనిస్ ఖాన్ మృతి కేసు... కోల్‌కతాలో నిరసనలు...

ABN , First Publish Date - 2022-02-23T02:05:04+05:30 IST

అలియా విశ్వవిద్యాలయం విద్యార్థి అనిస్ ఖాన్

అనిస్ ఖాన్ మృతి కేసు... కోల్‌కతాలో నిరసనలు...

కోల్‌కతా : అలియా విశ్వవిద్యాలయం విద్యార్థి అనిస్ ఖాన్ (27) అనుమానాస్పద మృతి నేపథ్యంలో మంగళవారం సెంట్రల్ కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్క్ సర్కస్ ఏరియా నుంచి కాలేజ్ స్ట్రీట్ వరకు జరిగిన ప్రదర్శనలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. 


పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మూడు అంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. వాటర్ కెనన్లను మోహరించారు. మహాత్మా గాంధీ రోడ్డు వద్ద నిరసనకారులను అడ్డుకుని, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. 


అనిస్ ఖాన్ హౌరా జిల్లాలోని శారదా దక్షిణ్ ఖాన్ పర గ్రామంలో నివసిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, ఫిబ్రవరి 18 రాత్రి నలుగురు వ్యక్తులు తమ ఇంట్లో చొరబడ్డారని, వారిలో ఒకరు పోలీసు యూనిఫాంలో ఉన్నారని చెప్పారు. వారు ఖాన్‌ను పై నుంచి తోసేశారని, దీంతో ఆయన మరణించారని తెలిపారు. 


ఓ నిరసనకారుడు మీడియాతో మాట్లాడుతూ, ఖాన్‌ను పోలీసులే హత్య చేశారని ఆరోపించారు. ఆయన మంచి పని కోసం పోరాడుతున్నారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 


సిట్ ఏర్పాటు

ఇదిలావుండగా, ఖాన్ మరణంపై దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 14 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. 


ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు

విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను, ఓ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు ఫోన్ చేసినపుడు వీరు సక్రమంగా స్పందించలేదని పేర్కొన్నారు. 




Updated Date - 2022-02-23T02:05:04+05:30 IST