‘ప్రభం’జనం

ABN , First Publish Date - 2022-01-17T06:49:48+05:30 IST

మండలంలో ఆదివారం ప్రభల తీర్థం కనుల పండువగా జరిగింది. జగ్గన్నతోట భక్తజన సంద్రంగా మారింది. తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ తీర్థానికి వేలాదిగా పోటెత్తిన భక్తులు ప్రభలకు స్వాగతం పలికారు. ఇరుసుమండ, కె.పెదపూడి, మొసలపల్లి నుంచి జగ్గన్నతోటకు దారితీసే రోడ్లన్నీ కిటకిటలాడాయి.

‘ప్రభం’జనం
పి.గన్నవరం మండలం కుందాలపల్లిలో ప్రభను పంట కాలువను దాటిస్తున్న గ్రామస్తులు


  • నేత్రపర్వంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం
  • కొలువుదీరిన ఏకాదశ రుద్రులు 
  • పోటెత్తిన భక్తులు

చుట్టూ కొబ్బరిచెట్లు... పచ్చని తివాచీ పరుచుకున్నట్టుగా పంట పొలాలు... పిల్ల కాలువలు... వాటి నడుమ కోటి వన్నెలద్దిన హరివిల్లులా మెరిసినప్రభలు... సంక్రాంతి పర్వదినాల సందర్భంగా కోనసీమ ఆధ్యాత్మిక సౌరభంతో పులకించింది. నేల అణువణువూ జనావర్ణమే అయింది. సీమ నలుచెరుగులా మహోత్సాహంగా జరిగిన ప్రభల తీర్థంలో పుడమి తల్లి సాక్షిగా కైలాసమే కొలువుదీరినట్టు కనిపించింది.

అంబాజీపేట, జనవరి 16: మండలంలో ఆదివారం ప్రభల తీర్థం కనుల పండువగా జరిగింది. జగ్గన్నతోట భక్తజన సంద్రంగా మారింది. తెలుగువారి సంస్కృతీ, సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ తీర్థానికి వేలాదిగా పోటెత్తిన భక్తులు ప్రభలకు స్వాగతం పలికారు. ఇరుసుమండ, కె.పెదపూడి, మొసలపల్లి నుంచి జగ్గన్నతోటకు దారితీసే రోడ్లన్నీ కిటకిటలాడాయి. 400 ఏళ్లకు పైగా ఏకాదశ రుద్రులకు కొలువుగా ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోటకు వివిధ గ్రామాల నుంచి 11 ప్రభలు తరలివచ్చాయి. మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి ప్రభ ఉదయం తొమ్మిది గంటలకే తీర్థంలో కొలువుదీరి ఇతర గ్రామాల ప్రభలకు స్వాగతం పలికింది. కౌశిక అవతలవైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి ప్రభ, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి ప్రభ కౌశిక దాటి తీర్థంలోకి ప్రవేశించిన ఘట్టం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. శరభ... శరభ.. అశ్శరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజానకెత్తుకొని భక్తిభావంతో ముందుకు సాగారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయా గ్రామాల్లోని ప్రభలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ప్రభలపై కొలువుతీర్చి మేళాతాళాలతో తీర్థానికి తీసుకువచ్చారు. ఆరేళ్ల చిన్నారుల నుంచి తొంభైయేళ్ల వృద్ధుల వరకూ తీర్థానికి తరలివచ్చారు. నరేంద్రపురం, అవిడి, రాకుర్తివారిపాలెం ప్రభలు చిరతపూడిలో కొలువుదీరాయి. వాకలగరవు, తొండవరం ప్రభలు తొండవరంలో కొలువుదీరాయి. తొండవరం, వాకలగరువు ప్రభలు ఒకదానితో మరొకటి పోటీపడి చూపరులను కనువిందు చేశాయి. 

ఆకట్టుకున్న అలంకరణలు

జగ్గన్నతోట తీర్థంలో కొలువుతీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి, వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వరస్వామి, కె.పెదపూడి మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనందరామేశ్వరస్వామి, వక్కలంక కాశీవిశ్వేశ్వరస్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు తరలివచ్చాయి. శిలాతోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలకరించారు.

కొవిడ్‌ మూడో దశ ముమ్మరంగా ఉన్నప్పటికీ ప్రభల ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. భక్తి భావంతో ప్రభలపై ఉన్న ఉత్సవమూర్తులను దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. 


Updated Date - 2022-01-17T06:49:48+05:30 IST