వ్యాక్సిన్ కంపెనీలకు భారీగా రుణాలు
ABN , First Publish Date - 2021-05-15T05:59:26+05:30 IST
సీన్ రివర్స్ అవుతోంది. ‘అప్పులివ్వండి మహా ప్రభో’ అని కంపెనీలు బ్యాంకుల చుట్టూ తిరగడం పరిపాటి. ఇప్పుడు ‘బాబ్బాబు...అప్పులిస్తాం. తీసుకోండి
భారత్ బయోటెక్కు రూ.1,000 కోట్లు
సీరమ్ ఇనిస్టిట్యూట్కు రూ.6,000 కోట్లు
ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా అప్పులు ఇస్తున్న బ్యాంకులు
న్యూఢిల్లీ: సీన్ రివర్స్ అవుతోంది. ‘అప్పులివ్వండి మహా ప్రభో’ అని కంపెనీలు బ్యాంకుల చుట్టూ తిరగడం పరిపాటి. ఇప్పుడు ‘బాబ్బాబు...అప్పులిస్తాం. తీసుకోండి. ప్లీజ్’ అని బ్యాంకులే కంపెనీల ముందు బారు లు తీరుతున్నాయి. అయితే ఇది అన్ని కంపెనీలకు వర్తించదు. కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో పుణె కేంద్రంగా పని చేసే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) రూ.6,000 కోట్లు, హైదరాబాద్ కేంద్రంగా కార్య కలాపాలు సాగిస్తున్న భారత్ బయోటెక్ రూ.1,000 కోట్లు రుణాలుగా తీసుకున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే ఇందులో రూ.1,200 కోట్ల రుణాన్ని వినియోగించుకుంది.
ఎందుకంటే: కొవిడ్ రెండో ఉధృతి నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం రూ.50,000 కోట్లతో ప్రత్యేక రుణ పథకం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది. బ్యాంకు లు ఈ నిధులను వ్యాక్సిన్ కంపెనీలు, ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల కంపెనీలకు రుణాలుగా ఇవ్వవచ్చు. ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఈ నిధులు ప్రస్తుత రెపో రేటైన నాలుగు శాతం వడ్డీకే లభిస్తాయి. పైగా వీటిని ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణిస్తామని ప్రకటించింది. దీంతో వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు రుణాలు ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి.
డిమాండ్ అంతంతే: బ్యాంకులు ఎంత ఎగబడుతున్నా, వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఈ రుణాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇవన్నీ పుష్కలంగా మిగులు నిధులు ఉన్న కంపెనీలు కావడమే ఇందుకు కారణం. దీనికి తోడు వ్యాక్సిన్ కొనుగోళ్ల కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కంపెనీలకు రూ.4,500 కోట్ల నిధులు అందాయి. ఇందులో రూ.3,000 కోట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్కు, భారత్ బయోటెక్కు రూ.1,500 కోట్లు అందాయి. దీంతో ఈ కంపెనీలు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోక పోవచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.