చింతపల్లిలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-12-06T04:47:05+05:30 IST

చింతపల్లి పంచాయతీ కొత్తూరులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం 22 ఇళ్లు కాలిపోయాయి. కార్తీక పూజల్లో భాగంగా ఉదయం ఓ ఇంటి వద్ద వెలిగించిన దీపం కింద పడి మంటలు వ్యాపించి ఉండొచ్చునని భావిస్తున్నారు.

చింతపల్లిలో భారీ అగ్నిప్రమాదం
అగ్నికి ఆహుతి అవుతున్న ఇళ్లు

22 పూరిళ్లు దగ్ధం

సుమారు రూ.30లక్షల ఆస్తినష్టం

పూసపాటిరేగ, డిసెంబరు5: చింతపల్లి పంచాయతీ కొత్తూరులో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం 22 ఇళ్లు కాలిపోయాయి. కార్తీక పూజల్లో భాగంగా ఉదయం ఓ ఇంటి వద్ద వెలిగించిన దీపం కింద పడి మంటలు వ్యాపించి ఉండొచ్చునని భావిస్తున్నారు. అన్నీ పూరిళ్లు కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లు పక్కపక్కనే ఉండడం.. ఆ సమయంలో గాలి వీచడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. గంట వ్యవధిలో ఇళ్లన్నీ దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.30లక్షల వరకూ ఆస్తినష్టం  సంభవించినట్టు ప్రాథమిక అంచనా. చాలా కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. సుమారు రూ.10లక్షల మేర కరెన్సీ నోట్లు కూడా కాలిపోయినట్లు బాధితులు తెలుపుతున్నారు. సర్వం కోల్పోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. కొన్ని ఇళ్ల వారు విశాఖలో ఉన్నారు. ఆ ఇళ్లలో ఏమీ మిగలలేదు. మంటలను అదుపుచేసేందుకు విజయనగరం నుంచి అగ్నిమాపక యంత్రంతోపాటు అరబిందో పరిశ్రమకు చెందిన అగ్నిమాపక యంత్రం కూడా వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంది. ఎస్‌ఐ జయంతి, ఇన్‌చార్జి తహసీల్దారు విజయ్‌భాస్కర్‌ బాధితులను పరామర్శించారు. నష్టాన్ని అంచనా వేశారు.

ఇల్లు కోల్పోయాం

అగ్ని ప్రమాద సమయంలో మేము ఇంటివద్ద లేము. విషయం తెలిసి సముద్రతీరం నుంచి చేరుకొనే సరికి నా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కుటుంబమంతా నిరాశ్రయులమయ్యాం. నిలువ నీడను కోల్పోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. 

- చుక్క దానయ్య, బాధితుడు

కరెన్సీ నోట్లు కాలిపోయాయి

కళ్ల ముందే ఇల్లు అగ్నికి ఆహుతైంది. కుటుంబమంతా బయటకు పరుగులు తీశాం. ధ్రువపత్రాలు, కొంతమొత్తంలో కరెన్సీ నోట్లు బూడిదయ్యాయి. అంతంతమాత్రంగా ఉన్న మా బతుకులను ఈ ప్రమాదం నిండా ముంచేసింది.

- మైలపల్లి అమ్మోరు, బాధితురాలు


Updated Date - 2020-12-06T04:47:05+05:30 IST