ఏయూకు స్టీల్ప్లాంట్ భారీ విరాళం
ABN , First Publish Date - 2021-06-20T05:34:41+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్) భారీ విరాళాన్ని అందజేసింది.
రూ.32.5 లక్షల చెక్కును అందజేసిన ‘ఉక్కు’ సీఎండీ
ఏయూ క్యాంపస్, జూన్ 19: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్) భారీ విరాళాన్ని అందజేసింది. వర్సిటీలో ఆర్ఐఎన్ఎల్ సెంటర్ ఫర్ మెడికల్ జెనిటిక్స్ ఏర్పాటుకు తొలివిడతగా రూ. 32.5 లక్షల చెక్కును శనివారం వీసీ పీవీజీడీ ప్రసాద్రెడ్డికి స్టీల్ ప్లాంట్ సీఎండీ కేసీ దాస్ అందజేశారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ జన్యు సమస్యలపై పరిశోధనలకు ఈ కేంద్రం ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో రెండో విడత నిధులను అందజేస్తామన్నారు. ఏయూలో బోధన, పరిశోధన రంగాలలో కలిసి పనిచేయడానికి నైపుణ్యమంతమైన మానవ వనరులను తీర్చిదిద్దడానికి ఆర్ఐఎన్ఎల్ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. వర్సిటీలో రెండు ఆర్ఐఎన్ఎల్ రీసెర్చ్ చెయిర్లను అందిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదన తమకు సత్వరం అందించాలని కోరారు. వీసీ ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఏయూలో విశిష్ట ఆచార్యులుగా ఆర్ఐఎన్ఎల్ నిపుణులను ఆహ్వానిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఉక్కు’ డైరెక్టర్లు వీవీ వేణుగోపాలరావు, అజిత్కుమార్ సక్సేనా, ఏయూ రెక్టార్ సమత, రిజిస్ట్రార్ కృష్ణమోహన్తోపాటు పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.