HYD : దక్షిణమధ్య రైల్వేకు కాసుల వర్షం
ABN , First Publish Date - 2022-05-07T19:09:39+05:30 IST
దక్షిణ మధ్య రైల్వే కొవిడ్ తెచ్చిన నష్టాన్ని క్రమేపీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది..
- ఏప్రిల్లో రికార్డుస్థాయిలో రూ.370 కోట్ల ఆదాయం
హైదరాబాద్ సిటీ : దక్షిణ మధ్య రైల్వే కొవిడ్ తెచ్చిన నష్టాన్ని క్రమేపీ అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. మునుపెన్నడూలేని రీతిలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో 370.05 కోట్ల ఆదాయంతో రికార్డు సృష్టించింది. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల పరిధిలో కొవిడ్కు ముందు రోజుకు సగటున 726 రైళ్లు రాకపోకలు సాగించాయి. ప్రస్తుతం అన్ని డివిజన్లలో 292 రైళ్లు నడుస్తున్నాయి. వీటితోపాటు గత ఏప్రిల్లో 250 ప్రత్యేక రైళ్లను నడిపించారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు ఐదు రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు అంబేడ్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రెండో శనివారం, ఆదివారం ఇలా.. వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రాకపోకల సంఖ్య బాగా పెరిగింది. ఈ ఐదు రోజుల్లో రూ.57.62 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా సికింద్రాబాద్, విజయవాడ డివిజన్లలో రోజుకు లక్షన్నర మందికిపైగా ప్రయాణించినట్లు పేర్కొన్నారు.