బీసీ కమిషన్‌ ఏర్పాటు ఎలా?: హైకోర్టు

ABN , First Publish Date - 2020-02-25T11:02:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఏర్పాటైందా?.. అలాంటి కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందో లేదో వివరించాలని పిటిషనర్లను, అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు కోరింది. అదేవిధంగా బీసీల సామాజిక, విద్యాపరమైన

బీసీ కమిషన్‌ ఏర్పాటు ఎలా?: హైకోర్టు

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ రాజ్యాంగంలోని 340 అధికరణ కింద ఏర్పాటైందా?.. అలాంటి కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందో లేదో వివరించాలని పిటిషనర్లను, అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు కోరింది. అదేవిధంగా బీసీల సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం గురించి వెల్లడించాలని ఈ కమిషన్‌ను రాష్ట్రపతి కోరగలరా? ఈ వెనుకబాటుతనాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసే అధికారం బీసీ కమిషన్‌కు ఉందా తదితర అంశాలపై నెలకొన్న సందేహాలను కూడా నివృత్తి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ (19.08శాతం), ఎస్టీ (6.77శాతం), బీసీ (34 శాతం)లతో కలిపి మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత డిసెంబరు 28న జారీ చేసిన జీవో 176తో పాటు, బీసీల రిజర్వేషన్లకు వీలు కల్పిస్తున్న ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని పలు సెక్షన్లను సవాల్‌ చేస్తూ కర్నూలుకు చెందిన బి.ప్రతా్‌పరెడ్డితో పాటు మరికొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఇప్పటికే పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్‌.ప్రణతి తదితరులు, ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. కాగా ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 202-ఎ (బీసీలకు రిజర్వేషన్లు) పైనా వాదనలు వినిపించాలని ధర్మాసనం ఇరువర్గాలకు సూచించింది. దీనిపై మంగళవారం విచారణ జరుగనుంది. 

Updated Date - 2020-02-25T11:02:04+05:30 IST