కూరగాయల మీది రసాయన అవశేషాలను ఎలా తగ్గించాలి?
ABN , First Publish Date - 2022-03-18T17:02:11+05:30 IST
ఆహారాన్ని పండించడానికి ఎరువులు, పురుగుమందులు వాడతారు. ఆరోగ్యం పై వీటి ప్రభావం తగ్గించడానికి ఏమి చేయాలి?
ఆంధ్రజ్యోతి(18-03-2022)
ప్రశ్న: ఆహారాన్ని పండించడానికి ఎరువులు, పురుగుమందులు వాడతారు. ఆరోగ్యం పై వీటి ప్రభావం తగ్గించడానికి ఏమి చేయాలి?
- కోమలి, విజయవాడ
డాక్టర్ సమాధానం: ఆహారంలోని పోషకాలు వాటిని పండించే నేల సారంపై అధికంగా ఆధారపడి ఉంటాయి. అధిక దిగుబడుల కోసం, పంటను రక్షించుకోవడానికి కృత్రిమ ఎరువులు, పురుగుమందుల వాడకం తప్పని సరి అయ్యింది. ఇవే కాక సహజ ఎరువులు, కొన్ని రకాల సహజ పురుగు మందులను మాత్రమే ఉపయోగించి పండించే ఆర్గానిక్ ఉత్పత్తులు కూడా నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ రెండింటి పోషక విలువల్లో తేడా లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తులు అందుబాటులో లేని వారు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఆహారంలో రసాయనాల అవశేషాలను సురక్షిత స్థాయికి తీసుకు రావచ్చు. కూరగాయలను ముక్కలుగా కోయక ముందే ఉప్పు లేదా వెనిగర్ వేసిన నీళ్లలో కాసేపు నానబెట్టడం మంచిది. ఆకుకూరలను పది నిమిషాల పాటైనా ఉప్పు నీళ్లలో నానబెట్టి తరువాత ఒకటి రెండు సార్లు మంచి నీళ్లలో కడగాలి. ధాన్యాలు, పప్పులు ఒకటికి రెండు సార్లు; పండ్లను కొద్దిసేపు ఉప్పు నీటిలో నానబెట్టి మెత్తటి బ్రష్తో రుద్ది కడగడం, ఆహారాన్ని తగిన ఉష్ణోగ్రతలో వండడం మొదలైన పద్ధతులను పాటించాలి. దీని వల్ల ఆహారంలోని పోషక విలువలకు ఎక్కువ నష్టం కలగకుండానే వాటిపై రసాయన అవశేషాలను తొలగించవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)