ఎండల నుంచి రక్షణకు...

ABN , First Publish Date - 2020-03-15T16:21:56+05:30 IST

వేసవి కాలం వచ్చేస్తోంది. ప్రతీ ఏడాది ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా వేసవికి ఎలా సిద్ధం కావాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎండల నుంచి రక్షణకు...

ఆంధ్రజ్యోతి(15-03-2020) 

ప్రశ్న: వేసవి కాలం వచ్చేస్తోంది. ప్రతీ ఏడాది ఎండలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఆరోగ్యపరంగా వేసవికి ఎలా సిద్ధం కావాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

-రజనీ


జవాబు : వేసవికి సిద్ధం కావాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి.

1. హిమోగ్లోబిన్‌ శాతం చెక్‌ చేసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్నవారు ఎండ వేడిమిని తట్టుకోవడం కష్టం అవుతుంది.

2. అధిక బరువు ఉన్నవారు కనీసం 3 నుంచి 5 కిలోలు తగ్గాలి. బరువు ఎక్కువ ఉన్నవారిలో అధిక వేడి వల్ల రాషెస్‌ ఎక్కువగా ఉంటాయి. అలాగే తక్కువ బరువు గలవారు 3 కిలోలు పెరగాలి. లేదంటే వీరికి సమ్మర్‌లో వడదెబ్బ త్వరగా తగిలే అవకాశాలెక్కువ.

3. వేసవికాలం మిగతా దుస్తులు పక్కనపెట్టి, కాటన్‌ దుస్తులు రెడీ చేసుకోవడం తప్పనిసరి.


ఇక మిగతా విషయాలకొస్తే...

సమ్మర్‌లో అన్నింటికన్నా ముఖ్యం హైడ్రేట్‌గా ఉండటం. బయటకు వెళ్లేప్పుడు నీళ్ల బాటిల్‌ వెంట తీసుకుని వెళ్లాలి.

ఉదయం 9 కల్లా ఆఫీస్‌కు వెళ్లడం, సాయంత్రం 5 తర్వాతే బయటకు రావడం చేయాలి. ఈ విధంగా చేస్తే వడదెబ్బ బారిన పడరు.

ఏసీ గదుల్లోంచి వెంటవెంటనే మారకూడదు. ఏసీ గది నుంచి ముందుగా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న గదిలోకి వచ్చి, తర్వాత ఎండలోకి వెళ్లొచ్చు. దీనినే ‘క్లయిమటైజేషన్‌’ అంటారు. హఠాత్తుగా ఉష్ణోగ్రతల మార్పు వల్ల రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అయితే అది మన కంటికి కనిపించదు. కానీ శరీరానికి నష్టం జరుగుతుంది. అదే విధంగా బయటి నుంచి రాగానే వెంటనే చల్లటి నీళ్లు తాగొద్దు. 5 నిమిషాలు ఆగిన తర్వాత తాగాలి. 

ఎండలకు నిమ్మరసం కలిపిన మజ్జిగ దివ్యౌషధంలా పనిచేస్తుంది. మజ్జిగలో ఉన్న కాల్షియం, ఉప్పులో ఉండే సోడియం, నిమ్మరసంలోని పొటాషియం వడదెబ్బ నుంచి రక్షించడమేగాక, శరీరానికి ఉపశమనాన్ని ఇస్తాయి.

వేసవిలో పండ్లరసాలు, సూప్స్‌ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు.


డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌


Updated Date - 2020-03-15T16:21:56+05:30 IST