రోజుకు రెండుకు మించకుండా తింటే..
ABN , First Publish Date - 2020-12-11T15:26:10+05:30 IST
వయసుతో నిమిత్తం లేకుండా అందరూ బాదం, ఆక్రోట్, పిస్తా, వేరుశెనగ, జీడిపప్పు, పుచ్చ గింజలు మొదలైనవి తినవచ్చు. ఇవన్నీ కెలోరీలు ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి మోతాదు విషయంలో
ఆంధ్రజ్యోతి(11-12-2020)
ప్రశ్న: అరవై సంవత్సరాలు దాటినవారు నట్స్ (గింజలు), డ్రై ఫ్రూట్స్ (ఎండు ఫలాలు) రోజుకు ఎన్ని తీసుకోవచ్చు?
- మల్లీశ్వరి, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: వయసుతో నిమిత్తం లేకుండా అందరూ బాదం, ఆక్రోట్, పిస్తా, వేరుశెనగ, జీడిపప్పు, పుచ్చ గింజలు మొదలైనవి తినవచ్చు. ఇవన్నీ కెలోరీలు ఎక్కువగా ఉండే ఆహారం కాబట్టి మోతాదు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అరవైయేళ్ల వయసు దాటినవారు రోజుకు ఇరవై నుంచి ముప్పై గ్రాములకు మించకుండా ఈ నట్స్ తీసుకోవచ్చు. నిత్యం ఒకేలాంటివి కాకుండా రోజుకు ఒకరకం తీసుకున్నా మంచిదే. ఇక కిస్మిస్, ఖర్జూరం, అంజీర్ వంటి డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే వీటిలో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి రోజుకు రెండుకు మించకుండా ఖర్జూరం లేదా అంజీర్; కిస్మిస్ అయితే పది లేదా పదిహేనుకు మించకుండా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా నట్స్, డ్రై ఫ్రూట్స్ రోజూ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని కూడా శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. వయసు పెరిగిన వారు దంత సమస్యల మూలాన ఈ గింజలను అలాగే తీసుకోలేకపోతే వాటిని పొడికొట్టి పాలు లేదా జావ, ఓట్స్లలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.comకు పంపవచ్చు)