సీఆర్జెడ్ భూములు పేదలకు ఎలా ఇస్తారు
ABN , First Publish Date - 2020-05-23T08:48:28+05:30 IST
గిలకలదిండిలో సముద్ర తీరాన సీఆర్జెడ్-1ఏ పరిధిలోని భూములను నివేశన స్థలాలకు ఎలా ఇస్తారని
నివాసయోగ్యమైతే కేసు విత్డ్రా బాధ్యత తీసుకుంటా కొల్లు సవాల్
మచిలీపట్నం టౌన్, మే 22 : గిలకలదిండిలో సముద్ర తీరాన సీఆర్జెడ్-1ఏ పరిధిలోని భూములను నివేశన స్థలాలకు ఎలా ఇస్తారని మంత్రి పేర్ని నానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సవాల్ విసిరారు. బందరులోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలకు ఎంపిక చేసిన భూములు నివాస యోగ్యమైనవిగా రుజువు చేస్తే కోర్టుకు వెళ్లిన వారితో మాట్లాడి కేసు విత్డ్రా చేసే బాధ్యతను తాను తీసుకుంటానని రవీంద్ర సవాల్ విసిరారు. ిసీఆర్జెడ్-1 (కోస్టల్ రెగ్యులేటరీ జోన్) పరిధిలోని భూమి పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతమన్నారు. మడ అడవులు, ఇసుక తిన్నెలు ఉండే ప్రాంతంలో ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఇక్కడ నివసించేవారు ప్రమాదాలకు గురికాక తప్పదన్నారు.
ఏ అనుమతులు లేకుండా నివేశన స్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. గిలకలదిండిలో టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లడం వల్ల నివేశన స్థలాల పంపిణీ ఆగిపోయిందని ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఉప్పు కొఠారుల నుంచి మట్టి తోలి బిల్లులు చేసుకోవాలని చూస్తున్నారన్నారు. కరగ్రహారంలో, ఇతర ప్రాంతాల్లో నివేశన స్థలాల పంపిణీని తాము ఎక్కడా వ్యతిరేకించలేదన్నారు. 30 ఏళ్లుగా మంగినపూడిలోని సీఆర్జెడ్ భూముల్లో నివాసం ఉంటున్న ఉప్పాడవాసులకు ఇప్పటికీ ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
అగ్నిప్రమాదంలో వారి పాకలు దగ్ధమైనా ప్రభుత్వ సాయం అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. గిలకలదిండి, క్యాంప్బెల్పేట వాసులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తమ హయాంలో ప్రతిపాదించామని, ప్రభుత్వం మారడంతో ఆ సాయం చేయలేకపోయామన్నారు. మడ అడవులు ఉండటం వల్ల 1977లో మచిలీపట్నం ముంపునకు గురికాలేదని ఆయన పేర్కొన్నారు. గిలకలదిండిలోని మడ అడవులు నరికిస్తే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మచిలీపట్నం కూడా ముంపునకు గురయ్యే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పారు.