తల్లిదండ్రులకు నెగిటివ్.. ఐదు నెలల ఆ పసిబిడ్డకు కరోనా ఎలా వచ్చింది..?
ABN , First Publish Date - 2020-05-28T17:53:23+05:30 IST
రంపచోడవరానికి చెందిన ఐదు నెలల పసి బిడ్డకు పాజిటివ్ వచ్చిన వ్యవహారం వైద్యులను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ చిన్నారికి ఆదివారం కొవిడ్ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులకు పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో బాబుకు వైరస్ ఎలా వచ్చిందనేది
రంపచోడవరంలో కొవిడ్ సోకిన ఐదు నెలల చిన్నారికి మళ్లీ పరీక్షలు
తల్లిదండ్రులకు టెస్టుల్లో నెగిటివ్.. అయినా బాబుకి పాజిటివ్
టెస్టుల్లో తప్పులున్నాయేమోననే అనుమానంతో మరోసారి శాంపిల్స్ సేకరణ
విశాఖ నుంచి పంపించిన విమ్స్ వైద్యులు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రంపచోడవరానికి చెందిన ఐదు నెలల పసి బిడ్డకు పాజిటివ్ వచ్చిన వ్యవహారం వైద్యులను గందరగోళానికి గురి చేస్తోంది. ఈ చిన్నారికి ఆదివారం కొవిడ్ నిర్ధారణ కావడంతో తల్లిదండ్రులకు పరీక్షలు చేస్తే నెగిటివ్ వచ్చింది. దీంతో బాబుకు వైరస్ ఎలా వచ్చిందనేది అంతుపట్టడం లేదు. రంపచోడవరం మండలం బోలగొండ పంచాయతీ పరిధిలోని చెరువూరు గ్రామానికి చెందిన దంపతులకు ఐదు నెలల బాబు ఉన్నాడు. ఈ నెల 20న అనారోగ్యంతో ఉన్న పసి బిడ్డను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అత్యవసర చికిత్స కోసం రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరిగి కాకినాడ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చి టెస్టులు జరపగా ఆదివారం రాత్రి పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు ఆ బిడ్డను విశాఖలోని విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి కొవిడ్ చికిత్స కోసం పంపించారు.
ఆ తర్వాత బిడ్డ తల్లిదండుల్రకు కొవిడ్ టెస్టులు చేస్తే నెగిటివ్ వచ్చింది. తల్లిదండ్రులకు కొవిడ్ లేకున్నా బిడ్డకు ఎలా వచ్చిందనేది ఇప్పుడు వైద్యులకు చిక్కు ప్రశ్నగా మారింది. ఒకవేళ ఎవరి ద్వారా అయినా వ్యాపించిందా? అంటే ఏజెన్సీలో ఇప్పటివరకు అసలెవరికీ పాజిటివ్ నమోదు కాలేదు. దీంతో ఒకవేళ టెస్టుల్లో తప్పులుదొర్లి బిడ్డకు పాజిటివ్గా తేలిందా? అనే చిన్న అనుమానం వైద్యులను తొలుస్తోంది. ఇదే విషయమై ఇక్కడి వైద్యులు విశాఖ విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. దీంతో మరింత స్పష్టత కోసం బిడ్డకు మరోసారి కొవిడ్ టెస్టు చేయాలని నిర్ణయించారు. దీంతో విశాఖలో విమ్స్ నుంచి కాకినాడకు బిడ్డ శాంపిల్స్ వచ్చాయి. గురువారం తేలనుంది. అయితే తమ బిడ్డకు ఇలా జరగడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.