ఉపాధి కూలీలతో ఇంటి పనులు?

ABN , First Publish Date - 2022-07-02T05:15:57+05:30 IST

టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 29, 30 తేదీల్లో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్‌ వేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధి కూలీలతో ఇంటి పనులు?
ఉపాఽధికూలీలతో ఇంటి నిర్మాణం పనులు చేపడుతున్న దృశ్యం

ఆరా తీస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు

టెక్కలి రూరల్‌, జూలై 1: టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 29, 30 తేదీల్లో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్‌ వేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్ట్‌ అసిస్టెంట్‌ కనుసన్నల్లోనే మొదటిరోజు సుమారు ఐదుగురు, రెండో రోజు 15 మందికిపైగా ఉపాధి కూలీలతో.. ఇంటి నిర్మాణ పనులు చేయించి మస్తర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఫీల్ట్‌అసిస్టెంట్‌తో పాటు ఆ శాఖ సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణ పనులు చేసిన కూలీలకు ఆ రెండు రోజుల తేదీల్లోని మస్టర్‌లో హాజరుకానట్లు చూపించినట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించుకోవడమే కాకుండా.. దానిని కప్పి పుచ్చేందుకు చేపట్టిన చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా దీనిపై ఇప్పటికే గురువారం పరిశీలించామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని.. ఫీల్డ్‌అసిస్టెంట్‌కు మెమో జారీ చేసి విచారణ చేపడతామని తెలిపారు.  

 

Updated Date - 2022-07-02T05:15:57+05:30 IST