బెంగళూరు వీడియో వల్ల కొల్హాపూర్‌‌లో హోటళ్లు, దుకాణాల మూసివేత

ABN , First Publish Date - 2021-12-19T16:21:40+05:30 IST

కర్ణాటకలోని బెంగళూరులో ఛత్రపతి శివాజీ మహరాజ్

బెంగళూరు వీడియో వల్ల కొల్హాపూర్‌‌లో హోటళ్లు, దుకాణాల మూసివేత

కొల్హాపూర్ (మహారాష్ట్ర) : కర్ణాటకలోని బెంగళూరులో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని అపవిత్రం చేయడంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కన్నడిగుల యాజమాన్యంలోని హోటళ్లు, దుకాణాలను శనివారం మూసివేశారు. మరోవైపు కర్ణాటకలో రిజిస్టర్ అయిన వాహనాల చోదకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


బెంగళూరులో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి నల్లని రంగును పూసినట్లు వీడియో వైరల్ అవడంతో, శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని పుణే సహా అనేక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. శనివారం పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై ప్రయాణించిన కర్ణాటక రిజిస్టర్డ్ వాహనాలపై నల్ల సిరాను నిరసనకారులు విసిరారు. 


శాంగ్లి జిల్లాలోని మిరజ్ నగరంలో కూడా కర్ణాటక రిజిస్టర్డ్ వాహనాలపై రాళ్ళు రువ్వారు. పుణేలో వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు కూడా నిరసన వ్యక్తం చేశాయి. షిరూర్‌లో ఓ సంస్థ కార్యకర్తలు కర్ణాటకవైపు వెళ్ళే బస్సులను ఆపి, ఛత్రపతి శివాజీ మహరాజ్ బొమ్మలను వేశారు. రాజ్యసభ సభ్యుడు శంభాజీ రాజే ఛత్రపతి మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని అపవిత్రం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


కొల్హాపూర్ జిల్లా శివసేన అధ్యక్షుడు సంజయ్ పవార్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని అపవిత్రం చేసినవారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలను అంగీకరించబోమని చెప్పారు. నిందితులను శిక్షించకపోతే తమ ఆందోళనను తీవ్రతరం చేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-12-19T16:21:40+05:30 IST