కంపు.. కంపు!
ABN , First Publish Date - 2021-05-14T06:26:22+05:30 IST
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణ చెత్తాచెదారంతో కంపు కొడుతోంది. రెండు నెలలుగా ఆసుపత్రిలో చెత్త, కొవిడ్ బాధితుల ఆహార పొట్లాలు గుట్టలుగా పేరుకుపోయాయి.
- గుట్టలుగా పేరుకుపోతున్న ఆహార పొట్లాలు
- అవస్థలు పడుతున్న కరోనా రోగులు
కర్నూలు(హాస్పిటల్), మే 13: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణ చెత్తాచెదారంతో కంపు కొడుతోంది. రెండు నెలలుగా ఆసుపత్రిలో చెత్త, కొవిడ్ బాధితుల ఆహార పొట్లాలు గుట్టలుగా పేరుకుపోయాయి. గతంలో ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పనులను ఏవన్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కార్మికులు బయో వేస్ట్, వాడి పడేసిన సర్జికల్స్ వేరు చేసి కుష్ఠు వ్యాధి వార్డు వద్ద డంప్ యార్డులో వేసేవారు. ఇక్కడి చెత్తను మున్సిపల్స్ సిబ్బంది తీసుకెళ్లేవారు. కొవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి మున్సిపల్ సిబ్బంది రావడం లేదు. ఇక కుష్ఠు నివారణ వార్డు, మానసిక వ్యాధుల విభాగం వద్ద ఉన్న డంప్ యార్డు స్థలంలో స్టేట్ క్యాన్సర్ విభాగం రావడంతో అక్కడ దాన్ని తొలగించారు. దీంతో రెండు నెలలుగా డంప్ యార్డు లేకపోవడంతో కార్మికులు మానసికవ్యాధుల వార్డు, కుష్ఠు నివారణ వార్డుల వద్ద బయటే పడేస్తున్నారు. కరోనాకు సంబంధించిన పీపీఈ కిట్లు, వాడి పడేసిన సర్జికల్ ఐటమ్స్, చెత్తాచెదారంతో ఆ ప్రాంతం కంపు కొడుతోంది.