బ్యాంకుల్లో భయానకం..!
ABN , First Publish Date - 2021-05-11T06:34:53+05:30 IST
కరోనా వలయ తాండవం చేస్తున్నా.. బ్యాంకుల వద్ద జనం మాత్రం తగ్గట్లేదు. గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు.
భారీగా గుమికూడుతున్న ఖాతాదారులు
కరోనాతో 9 మంది ఉద్యోగుల మృతి
300 మందికి పాజిటివ్
వ్యాక్సిన్, బందోబస్తు కోసం లేఖ రాసినా..
ఫలితం శూన్యం
అనంతపురం క్లాక్టవర్, మే 10: కరోనా వలయ తాండవం చేస్తున్నా.. బ్యాంకుల వద్ద జనం మాత్రం తగ్గట్లేదు. గుంపులుగుంపులుగా కనిపిస్తున్నారు. కర్ఫ్యూ మినహాయింపు సమయంలో బ్యాంకుల వద్ద జనమే జనం. దీంతో బ్యాంకుల్లో వైరస్ భయానకం సృష్టిస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 300 మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు కొవిడ్ బారిన పడగా.. 9 మంది మృతి చెందడం బ్యాంకర్లలో ఆందోళన కలిగిస్తోంది. పైగా బ్యాంకులకు వచ్చే ఖాతాదారులు, రైతులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదనీ, పోలీసు బందోబస్తు కల్పించి, వెంటనే వ్యాక్సిన్ వేయాలని ఎల్డీఎం.. జిల్లా ఎస్పీ, డీఎంహెచ్ఓలకు లేఖ రాసినా ఫలితం కనబడడం లేదు. జిల్లాలో మొత్తం 477 బ్యాంకు శాఖలున్నాయి. వీటిలో 5వేల మందికిగా పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా సెకెండ్వేవ్ ప్రారంభం నుంచి బ్యాంకు ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు కొనసాగిస్తున్నారు. బ్యాంకు పనివేళల కుదింపుతో మెరుగైన సేవలు అం దించడం బ్యాంకర్లకు గుదిబండగా మారింది. ఈ ఒత్తిడి భరించలేమని బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రతి బ్యాంకు వద్ద పోలీసు బందోబస్తు కల్పించాలనీ, లేకుంటే విధులు నిర్వహించలేమని ఎల్డీఎం.. ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. బ్యాంకర్లందరికీ వ్యాక్సిన్ వేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా డీఎంహెచ్ఓకు ఎల్డీఎం ఇప్పటికే లేఖ రాశారు. బ్యాంకర్లను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించినప్పటికీ కరోనా టీకా, పాజిటివ్లకు వైద్యచికిత్సలు అందించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన లేఖలో కోరారు. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదని బ్యాంకర్లు వాపోతున్నారు. కరోనా బారిన పడిన బ్యాంకు శాఖల్లో ప్రత్యామ్నాయంగా సిబ్బందిని నియమించుకున్నారు. ఆయా బ్రాంచ్లను శానిటైజ్ చేసుకుని, విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి బ్యాంకులో ఖాతాదారు లు, రైతులు భౌతికదూరం పాటించి, మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకోవాలని ఎల్డీఎం మోహన్మురళి కోరారు. రద్దీ ఉన్న బ్యాంకుల వద్ద ఆరుబయట టెంట్లు వేసి, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. బ్యాంకుల్లో సిబ్బంది కరోనా భయంతో బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారనీ, ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.