హైదరాబాద్లో నడిరోడ్డుపై తరిమి.. తరిమి హత్య
ABN , First Publish Date - 2021-03-20T16:55:42+05:30 IST
ఇమ్రాన్ను కొట్టి ఆటోలో కిడ్నాప్ చేసి గిరినగర్లో బంధించారు.
హైదరాబాద్/జీడిమెట్ల : ముగ్గురు యువకులు కత్తులతో నడిరోడ్డుపై స్వైర విహారం చేశారు. ఓ యువకుడిని తరిమి తరిమి కత్తులతో పొడిచి చంపేశారు. జగద్గిరిగుట్ట శ్రీనివాస్నగర్ బస్టాప్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఐడీపీఎల్ ప్రాంతంలోని గిరినగర్కు చెందిన నవాజ్ (20), శ్రీనివాస్నగర్ రింగ్బస్తీకి చెందిన షేక్ ఇమ్రాన్ (24) ఆటోడ్రైవర్లు. జనవరి 29న నవాజ్, అతని స్నేహితులు ఇమ్రాన్ను కొట్టి ఆటోలో కిడ్నాప్ చేసి గిరినగర్లో బంధించారు. హెచ్ఎంటీ జంగల్కు కూడా తీసుకెళ్లి కొట్టారు. దీనిపై ఇమ్రాన్ అప్పట్లో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా నవాజ్పై పగబట్టాడు. ఇద్దరు యువకులతో కలిసి నవాజ్ హత్యకు పథకం పన్నాడు.
పథకంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జగద్గిరిగుట్ట నుంచి శ్రీనివా్సనగర్కు వెళ్తున్న నవాజ్ను ఆటోలో నుంచి బలవంతంగా లాగారు. భయంతో రోడ్డుపై పరుగులు తీస్తున్న అతడిని ఇమ్రాన్, మరో ఇద్దరు యువకులు తరిమి తరిమి కత్తులతో గుండెల్లో పొడిచారు. రక్తపు మడుగులో పడి ఉన్న నవాజ్ను కొందరు వ్యక్తులు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. బాలానగర్ ఏసీపీ పురుషోత్తం, జగద్గిరిగుట్ట సీఐ సైదులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.