వలంటీర్లు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-04-17T04:51:33+05:30 IST
వలంటీర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ జి.వీర పాండియన్ సూచించారు.
కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 16: వలంటీర్లు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ జి.వీర పాండియన్ సూచించారు. కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కోడుమూరు నియోజకవర్గంలోని వలంటీర్ల సేవలకు సత్కార వేడుకలు, గ్రామ, వార్డు వలంటీర్లకు సేవా మిత్ర, సేవ రత్న,సేవ వజ్ర పురస్కారాల ప్రదానోత్సవం, సన్మాన వేడుకలను శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్తో పాటు కర్నూలు ఎంపీ డా.సంజీవ్కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే డా.జె.సుధాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. కరోనా మొదటి దశలో దేశంలో మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో అధికారులు, వలంటరీల సమష్టి కృషి వల్ల మన జిల్లాలో కరోనా కేసులు కంట్రోల్ చేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ ఇన్ప్క్షన్ రేటు 20 శాతం ఎక్కువగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. వలంటీర్లందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డిప్యూటీ సీఈవో భాస్కర్ నాయుడు, డీపీవో ప్రభాకర్ రావు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.