ప్రేమ పెళ్లి చేసుకున్నారని పగ.. పట్టపగలు నట్టింట్లోకి ప్రవేశించి దారుణం!

ABN , First Publish Date - 2022-04-18T17:50:16+05:30 IST

ఆ యువతీయువకులు పక్కపక్క ఇళ్లలో నివసించేవారు.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు..

ప్రేమ పెళ్లి చేసుకున్నారని పగ.. పట్టపగలు నట్టింట్లోకి ప్రవేశించి దారుణం!

ఆ యువతీయువకులు పక్కపక్క ఇళ్లలో నివసించేవారు.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. కులాంతర వివాహానికి అమ్మాయి తరఫు వారు అంగీకరించలేదు.. దీంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకుంది.. అతడి ఇంట్లోనే నివసిస్తోంది.. దీంతో ఆ యువతి సోదరుడు ఆ ఇద్దరిపై తీవ్రంగా ద్వేషం పెంచుకున్నాడు.. పట్టపగలు వారి ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరినీ హతమార్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 


మీరట్‌లోని సర్ధానా ప్రాంతానికి చెందిన జాకీ పట్వారీ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే ఆంచల్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కులాంతర వివాహానికి ఆంచల్ కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దాంతో 8 రోజుల క్రితం ఇద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం జాకీతో పాటు అతని ఇంట్లోనే ఆంచల్ నివసిస్తోంది. కులాంతర వివాహం చేసుకుని తమ పక్కింట్లోనే ఉంటున్న సోదరి, ఆమె భర్తపై ఆంచల్ సోదరుడు దాడికి తెగబడ్డాడు. 


సోమవారం ఉదయం నేరుగా వారి ఇంట్లోకి ప్రవేశించి ఆంచల్ గొంతు కోసేశాడు.   అనంతరం జాకీపై దాడి చేసి అతని శరరీంపై 12 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత జాకీ గొంతు కూడా కోసేశాడు. అనంతరం అక్కణ్నుంచి పరారయ్యాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-04-18T17:50:16+05:30 IST